
రేపిస్టు అంత్యక్రియలకు కోర్టు ఆదేశం
హుబ్లీ: నగరంలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి పోలీస్ ఎన్కౌంటర్కు గురైన బిహార్కు చెందిన వలస కూలీ కార్మికుడు రితీశ్కుమార్ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నెరవేర్చాలని కోర్టు ఆదేశించింది. దీంతో కేఎంసీ ఆస్పత్రి, సీఐడీ పోలీసు వర్గాలకు ఎంతో ఊరట లభించింది. ఈ క్రమంలో నిందితుడి స్వగ్రామం, కుటుంబ సభ్యులు ఎవరన్నది పోలీసులు ఇంత వరకు గుర్తించలేక పోయారు. ఈ నెల 13న రితీశ్కుమార్ చిన్నారిపై అత్యాచారం చేసి ఆమెను నిర్మాణ దశలో ఉన్న ఓ భవనపు మరుగుదొడ్డిలో హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై స్థానికులు ఉద్రేకానికి గురై ఆక్రోశం వెళ్లగక్కి నిరసన ర్యాలీలు చేపట్టారు. దీంతో పోలీసులు ఘటన జరిగిన సాయంత్రమే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరించే ఉద్దేశంతో అతడు ఉన్న నివాస స్థలం షెడ్ వద్దకు తీసుకెళ్లి వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించారు.
తప్పించుకోబోతుండగా కాల్పులు
ఈ క్రమంలో రాయనాళ బ్రిడ్జి వద్ద అతడు పోలీసులపై దాడి చేసి పరారు కావడానికి ప్రయత్నిస్తుండగా అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నపూర్ణ నిందితుడిని పారిపోవద్దంటూ రెండు సార్లు గాలిలో కాల్పులు జరిపి లొంగిపొమ్మని సూచించినా నిందితుడు పెడచెవిన పెట్టడంతో ఓ తూటా కాళ్ల పైన, మరో తూటా వెన్నుపై కాల్చడంతో నిందితుడు అక్కడే కుప్పకూలాడు. అతనిని చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆత్మరక్షణ కోసమే పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మృతుడి శవానికి అంతిమ సంస్కారం చేయరాదు. చేస్తే సాక్ష్యాలు నాశనం అవుతాయని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ప్రజాహిత వ్యాఖ్యం(రిట్) దాఖలు అయింది. ఇతడి పోస్టుమార్టం పరీక్ష జరిపి కోర్టు ఆదేశం కోసం కేఎంసీ ఆస్పత్రి వైద్యులు, సీఐడీ పోలీసులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
దొరకని నిందితుడి కుటుంబ వివరాలు
దీంతో గత 17, 18 రోజులుగా శవం కుళ్లిపోవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు శవం డీ కంపోజ్ అవుతుంది, దీన్ని మీ ఆధీనంలోకి తీసుకోవాలని ఆస్పత్రి వైద్యులకు లేఖ రాశారు. సీఐడీ పోలీసులు కూడా శవం సమాధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శవం కుళ్లిపోతుందని కోర్టుకు విన్నవించారు. ఈ అన్ని విషయాలను సమగ్రంగా విచారించిన కోర్టు ఎట్టకేలకు నిందితుడి అంతిమ సంస్కారాలు నెరవేర్చడానికి అనుమతి ఇచ్చింది. దీంతో సీఐడీ, కేఎంసీ వర్గాలకు ఊరట కలిగింది. కాగా నిందితుడి ఎన్కౌంటర్కు ముందు తాను బిహార్లోని పట్నాకు చెందిన వాడని చెప్పుకున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నానన్నారు. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నించారు. రెండు మూడు బృందాలుగా బిహార్, యూపీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఎంత గాలించినా నిందితుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలియరాలేదు. ఈనేపథ్యంలో మృతదేహానికి త్వరలో అంత్యక్రియలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
కేఎంసీ ఆస్పత్రి, సీఐడీ పోలీసు
వర్గాలకు ఊరట
త్వరలో మృతదేహానికి
అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు

రేపిస్టు అంత్యక్రియలకు కోర్టు ఆదేశం