
మే 5 నుంచి సర్వే ప్రక్రియ షురూ
రాయచూరు రూరల్: మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో సామాజిక న్యాయం ప్రకారం మాదిగ సముదాయాలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాదిగ ఐక్యత సంచాలకుడు రాజు డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణ చేసే దిశలో సమీక్షకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. మే 5 నుంచి ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మాదిగ అని జాబితాలో రాయించాలన్నారు. ఈ విషయంపై 1వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సంచరించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.