
కావేరి హారతికి రూ.92 కోట్లు
మండ్య : దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన కావేరి హారతికి సుమారు రూ.92 కోట్లను ప్రత్యేక పథకంలో మంజూరు చేశామని, దీనికి మంత్రి మండలిలో ఆమోదం తెలిపి నిర్ణయం తీసుకున్నామని, త్వరలో ప్రత్యేక సమితిని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ అన్నారు. మండ్యలోని కేఆర్ఎస్కు వచ్చి జలాశయం వద్ద నడుస్తూ పరిశీలించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశం, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరి హారతి కర్ణాటక రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందన్నారు. కేరళ, తమిళనాడుకు చెందిన ప్రజలు కూడా వచ్చి కావేరి పూజలో పాల్గొనవచ్చన్నారు. కావేరి హారతిని ఒకేసారి సుమారు 10 వేల మంది పాల్గొని చూసే ఆవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని రోజులు హారతి ఇవ్వాలి అనేది రాబోయే రోజుల్లో బెంగళూరులో అధికారులతో జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని అన్నారు. కావేరి హారతి కార్యక్రమానికి వచ్చె ప్రజలు కార్యక్రమం మొత్తం ముగిసే వరకు ఉండి అనంతరం వారు వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇందు కోసం రెవిన్యూ, దేవదాయ, పర్యాటక, నీటిపారుదల, బెస్కాంతో పాటు ఇతర అనేక శాఖల అధికారులతో కూడిన సమితిని ఏర్పాటు చేసి మరో రెండు మూడు రోజుల్లో నమూనా మొత్తం సిద్ధం చేస్తామన్నారు. కేఆర్ఎస్, బృందావనం అభివృద్ధి కోసం ఇప్పటికే టెండర్ పిలిచామన్నారు. కేఆర్ఎస్ పరిధిలోని సుమారు 4 పంచాయతీల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం అమలు చేస్తామన్నారు.
డీసీఎం డీ.కే.శివకుమార్