
అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తే జైలు
బళ్లారి రూరల్: స్వార్థంతో అధికారులపై అసత్య ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తే మూడేళ్ల జైలుశిక్ష తప్పదని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప వెల్లడించారు. గురువారం డీసీ కార్యాలయ ప్రాంగణంలోని తుంగభద్ర సభాంగణంలో అర్జీల స్వీకరణ, విచారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యక్తిగత కక్ష్య, స్వార్థంతో అధికారులపై అసత్య ఆరోపణలు చేసినట్లు విచారణలో తేలితే 6 నెలల నుంచి గరిష్టంగా 3 ఏళ్లు జైలుశిక్ష తప్పదని తెలిపారు. సమాచార హక్కు, లోకాయుక్త చట్టాన్ని దుర్వినియోగం చేసే స్వార్థపరులపై చర్యలు ఉంటాయని తెలిపారు. అవినీతిని, అవినీతిపరులను అంతం చేయడానికే లోకాయుక్త అని తెలిపారు. లోకాయుక్తగా నియమితుడైన తర్వాత తన అస్తి వివరాలను ప్రకటించానన్నారు. ఇద్దరు లోకాయుక్తలు ప్రతి జిల్లాలో 3 రోజులు పర్యటించి అధికారులపై అవినీతి ఆరోపణలు విచారించి అవినీతిని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సందర్భంలో 18 శాతం సాక్షరత ఉండేది, ఇప్పుడు 80 శాతం ఉంది. ఈ 80 శాతంలో 90 శాతం మంది విద్యావంతులకు చట్టంపై అవగాహన లేదని తెలిపారు. కరోనా తరువాత మనుషుల్లో మార్పు రాకపోగా అవినీతి మరింత పెరిగిందని తెలిపారు. స్వార్థపరుల వల్లనే ప్రకృతి నాశనమై పోతోందని తెలిపారు. సమానత సాధించిన మహిళలు పురుషుల కంటే అవినీతిలో ముందంజలో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు, వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా న్యాయసేవా ప్రాధికార అధ్యక్షురాలు, జిల్లా జడ్జి వేలా, జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా ఎస్పీ, జిల్లా లోకాయుక్త అధికారులు పాల్గొన్నారు.
అవినీతి సంపూర్ణ సంహారానికే
లోకాయుక్త
90 శాతం విద్యావంతులకు చట్టంపై అవగాహన లేదు
ఉపలోకాయుక్త న్యాయమూర్తి
బి.వీరప్ప వెల్లడి

అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తే జైలు