
బాధిత విద్యార్థికి న్యాయం చేస్తాం
● కళాశాలలో ఉచితంగా ఇంజనీరింగ్ సీటు: మంత్రి ఈశ్వర్ ఖండ్రే
సాక్షి,బళ్లారి: కేసీఈటీ పరీక్షల సందర్భంగా జంధ్యం తీయాలని ఆంక్షలు విధించడంతో పరీక్ష రాయని విద్యార్థికి న్యాయం చేస్తామని మంత్రి ఈశ్వర్ ఖండ్రే పేర్కొన్నారు. ఆదివారం ఆయన మరోమంత్రి రహీం ఖాన్తో కలిసి బీదర్ జిల్లాలోని బాధిత విద్యార్థి సుచివ్రత్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. విద్యార్థికి ధైర్యం చెప్పారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రం వద్ద జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా తమ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచితంగా సీటు కల్పిస్తామన్నారు. కామెడ్కే పరీక్షలు కూడా ఉన్నాయని, అందులో ఎంత ర్యాంకు వచ్చినా సీటు గ్యారెంటీ ఇస్తామన్నారు.
రొటావేటర్లో నలిగి
బాలుడి మృతి
హొసపేటె: రొటావేటర్లో నలిగి బాలుడు మృతి చెందిన విషాద ఘటన విజయనగరం జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోట్ గ్రామంలో జరిగింది. చిచిత్రదుర్గ జిల్లా మొళకాల్మూర్ తాలూకా కేలగలహట్టికి చెందిన ఒబన్న, దీప దంపతులకు నవదీప్(5) అనే కుమారుడు ఉన్నాడు. దీప తన కుమారుడితో కలిసి గుడేకోట్లోని పుట్టింటికి వచ్చింది. శనివారం సాయంత్రం బాలుడి తాత మారెన్న పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా నవదీప్ కూడా అందులోనే కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు రొటావేటర్లో బాలుడు చిక్కుకోగా శరీరం ఛిద్రమై మృతి చెందాడు. ముక్కలైన బాలుడి మృతదేహంతో ఘటన స్థలం భీతావహంగా మారింది. బాలుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గుడేకోట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వేరుశనగ లారీ దగ్ధం
హొసపేటె: లారీ బోల్తా పడి మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. ఈ సంఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా శివపుర గ్రామంలో జరిగింది. వేరుశనగ లోడుతో హోస్పేట మీదుగా చిత్రదుర్గ వైపు వెళుతున్న లారీ.. శివపురం వద్దకు రాగానే బోల్తా పడింది. డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు పూర్తిగా వ్యాపించి వాహనం దగ్ధమైంది. డ్రైవర్ కిందకు దిగి ప్రాణాలతో బయట పడ్డాడు. కూడ్లిగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ధార్వాడలోనూ జంధ్యం తీయించారు
హుబ్లీ: బీదర్, శివమొగ్గలో సీఈటీ పరీక్షల సందర్భంగా జంధ్యం వేసుకున్న విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించని ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా అలాంటి ఘటన ధార్వాడలో కూడా వెలుగు చూసింది. ధార్వాడ నగరంలో ఉరకడ్లి కళాశాల పరీక్ష కేంద్రంలో జేఎస్ఎస్ కళాశాల విద్యార్థి పరీక్ష రాసేందుకు వెళ్లగా ఆ కేంద్రం అధికారులు అభ్యంతరం తెలిపారు. జంధ్యం తీసి బ్యాగులో పెట్టుకున్న తర్వాతనే లోపలకు అనుమతించారని బాధిత విద్యార్థి తండ్రి వివేక్ హేరి తెలిపారు. ఈ ఘటనతో తన కుమారుడు షాక్కు గురై పరీక్షపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాడని పేర్కొన్నాడు. రెండు రోజుల తర్వాత ఉపనయం చేసి కొత్త జంధ్యం ధరింపజేశామన్నారు
పెండింగ్ బిల్లుల చెల్లింపు
రాయచూరురూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో 1566 మంది కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించిందని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి భోసురాజ్ వెల్లడించారు. శనివారం సాయ్రంతం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2023– 24లో 639 మందికి పూర్తిగా, 1361 మందికి కొంతమేర బిల్లులు మంజూరు చేశామన్నారు. 2025 ఫిబ్రవరిలో రూ.3,352,06 కోట్లతో పనులు జరగ్గా 267 మందికి బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. చెరువుల అభివృద్ధికి సంబంధించి రూ.210 కోట్లు, అనకట్టల పనులకు రూ.335 కోట్లు, ఎత్తిపోతల పథకాల పనులకు రూ.252.50 కోట్ల మేర బిల్లులు మంజూరు చేసినట్లు తెలిపారు. నీటిపారుదల శాఖలో తన తనయుడు రవి జోక్యం చేసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
తల్లిదండ్రుల చెంతకు బాలిక
గుంతకల్లు: తప్పిపోయిన ఓ బాలికను గుంతకల్లు రైల్వే పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర తెలిపిన మేరకు... కర్ణాటకలోని గదగ్కు చెందిన ఎనిమిదేళ్ల వయసున్న రోకియ తప్పిపోయింది. దీంతో తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న గుంతకల్లు జీఆర్పీ సిబ్బంది అప్రమత్తమై శనివారం రాత్రి రైల్వే స్టేషన్కు చేరుకున్న హుబ్లీ వైపు నుంచి వచ్చిన హంపి ఎక్స్ప్రెస్ (16591) రైలులోని బోగీలను పరిశీలించారు. ఓ బోగీలో దిగాలుతో కూర్చొని ఉన్న రోకియాను గుర్తించి తమ స్వాధీనంలోకి తీసుకుని సమాచారం ఇవ్వడంతో ఆదివారం ఉదయం గదగ్ పోలీసులు, తల్లిదండ్రులకు గుంతకల్లుకు చేరుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

బాధిత విద్యార్థికి న్యాయం చేస్తాం