
కొన్ని రోజులుగా ఆ మహిళ అత్తింటిలో వేధింపులు ఎదుర్కొంటోంది. ఏం జరిగిందో ఏమోకాని తన ఇద్దరు పిల్లలతో విగతజీవిగా కనిపించింది.
కర్ణాటక: కొన్ని రోజులుగా ఆ మహిళ అత్తింటిలో వేధింపులు ఎదుర్కొంటోంది. ఏం జరిగిందో ఏమోకాని తన ఇద్దరు పిల్లలతో విగతజీవిగా కనిపించింది. అత్తింటివారే గొంతు పిసికి చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మేఘ(26), పున్విత(6), మన్విత(3)లు మృతులు. సుమారు 8 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన ధనుంజయ అనే వ్యక్తితో మేఘకు వివాహమైంది.
వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. పుట్టింటినుంచి డబ్బు తేవాలని భర్త, అత్త, మామలు వేధించేవారని సమాచారం. వేధింపులు అధికం కావడంతో ఇటీవల మేఘ తన పుట్టింటివారికి తెలియజేసింది. తల్లిదండ్రులు వచ్చి సర్దిచెప్పి వెళ్లారు. ఈక్రమంలో మేఘ తన ఇద్దరు పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ కుమార్తె, ఆమె పిల్లలను భర్త ఇంటివారే హత్య చేశారని మేఘ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెరకనాంబి పోలీసులు వచ్చి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మేఘ భర్త, అత్త మామలు పరారీలో ఉన్నారు.