హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలో ఇంటిని అద్దెకు తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు ప్రాంతంలో వ్యభిచారాలు జోరుగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ సరోజ్కుమార్ ఠాగూర్కు రహస్య సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు హోసూరు డీఎస్పీ బాబుప్రశాంత్ నేతృత్వంలో పోలీసులు పట్టణంలోని బాగలూరు రోడ్డు ప్రాంతంలో బుధవారం రాత్రి గస్తీ నిర్వహించారు.
ఓ ఇంటిపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో డెంకణీకోట సమీపంలోని అంజలగిరి గ్రామానికి చెందిన శ్రీనివాస్(25), క్రిష్ణగిరి భారతీపురం ప్రాంతానికి చెందిన తిరుపతి(32), బెంగళూరు బండేపాళ్యం ప్రాంతానికి చెందిన మునిస్వామి(48) అని తెలిసింది.
ముగ్గురూ కలిసి ఎన్జివో కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులకు విముక్తి కల్పించారు.