● ఆర్యవైశ్య కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజయ్
కరీంనగర్: ‘నేనింతే. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటా. కష్టపడి పైకి వచ్చిన. నా దగ్గరకు పనుల కోసం వచ్చే ఏ ఒక్కరి దగ్గర పైసలు ఆశించను. వాళ్లకు సేవ చేయడంలోనే నాకు తృప్తి ఉంది. భవిష్యత్తులోనూ ఇట్లానే ఉంటా’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇకపై ఆర్యవైశ్యులతోపాటు వ్యాపారాలు చేసుకునే వారెవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కరీంనగర్లో సామాన్యు ల రాజ్యం వచ్చిందని, ఇకపై వ్యాపారులను ఎవరూ బెదిరించరన్నారు. నగరంలోని గాంధీరోడ్డులో ఉన్న వైశ్యభవన్లో శనివారం రాత్రి జరిగిన ఆర్యవైశ్య కార్పొరేటర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమిత్ షా, పీయూష్ గోయల్ వంటి టైగర్లు వైశ్యులేనన్నా రు. కరీంనగర్లో ఇద్దరు వైశ్యులు కార్పొరేటర్లేనని తెలిపారు. కరీంనగర్లో కన్యకా పరమేశ్వ రి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. పారదర్శకంగా ఆర్యవైశ్య సంఘ ఎన్నికలు జరిపి కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని అన్నారు.
డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హుజూరాబాద్: హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు శనివారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గపు ఆలోచనతో ముందుకెళ్తోందని మండిపడ్డారు. హుజూరా బాద్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల లక్షలాది మంది ప్రజల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త నుంచి కరెంట్ తీస్తామనే మాటలు నమ్మశక్యం కాదని, దీనివల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఆదేశిస్తే డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాకుండా, ముందుండి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ టౌన్: రాష్ట్రంలో నడుస్తోంది ప్రజా పాలన కాదని పాపాల పాలన అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆన్నారు. శనివారం కరీంనగర్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, సీపీఐ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చైర్పర్సన్ పీఠం గెలుచుకోకుండా అధికార పార్టీ కుట్రలు చేసిందని విమర్శించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం మానేసి, క్యాతనపల్లి అభివృద్ధికి సహకరించాలని కోరారు. బాల్క సుమన్ మాట్లాడుతూ చరిత్రలోనే స్పష్టమైన తీర్పు ప్రజలు ఇచ్చినప్పటికీ క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, జిల్లా మంత్రి వివేక్ కుట్రలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, సర్దార్ రవీందర్ సింగ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఏనుగు రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
విద్యానగర్(కరీంనగర్): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలోజీ సెంటర్ కరీంనగర్ ఆధ్వర్యంలో 15 రోజుల స్వల్పకాలిక టెక్నికల్ కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కే.అశోక్కుమార్ తెలిపారు. అవెర్నెస్ కోర్స్ ఆన్ ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్, బేసిక్ కోర్స్ ఆన్ ఎలక్ట్రికల్ వెహికిల్, జూనియర్ ప్రోడక్ట్ డిజైనర్ యూజింగ్ కాడ్ 2డీ, 3డీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 సంవత్సరాలు నిండిన యువత ఎస్సెస్సీ మెమో, కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 8500461506 నంబర్లో సంప్రదించాలన్నారు.


