అన్నదాతా.. రైతు వేదికకు రావా? | - | Sakshi
Sakshi News home page

అన్నదాతా.. రైతు వేదికకు రావా?

Jun 24 2025 3:29 AM | Updated on Jun 24 2025 3:29 AM

అన్నదాతా.. రైతు వేదికకు రావా?

అన్నదాతా.. రైతు వేదికకు రావా?

● కర్షకులను బతిమాలుకుంటున్న ఏఈవోలు ● సీఎం కార్యక్రమం కోసం ఏఈవోలకు టార్గెట్లు ● ప్రతీ ఆర్వీకి 200 మంది రైతులను తరలించాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 50 వేలకుపైగా రైతుల తరలింపు ● రైతులకు ఇచ్చే టీ, స్నాక్స్‌ డబ్బులు మాత్రం ఇవ్వరట ● మొన్నటి కార్యక్రమానికి పెట్టిన డబ్బులే రాలేదు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

రైతు వేదికల్లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంతో ఏఈవో (అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌)లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమానికి రైతు వేదిక(ఆర్వీ)ల వద్దకు రైతులను తరలించాలని జిల్లా వ్యవసాయాధికారులు టార్గెట్లు విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతీ ఆర్వీలో కనీసం 200 మందికి తగ్గకుండా రైతులను తరలించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో ఏఈవోలు ఇప్పుడు అదే పనిలో తలమునకలయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మెజారిటీ రైతులు సుముఖంగా లేరు. ప్రస్తుతం చాలా చోట్ల వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎంతో జరిగే ముఖాముఖిలో తప్పకుండా రైతుభరోసా లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది రైతులకు ఏఈవోలు ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమాలుతున్నారు. మొన్నామధ్య రైతుభరోసా ప్రారంభం సందర్భంగా కూడా రైతులతో ముఖ్యమంత్రితో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. అప్పుడు ప్రతీ ఏఈవోలకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 5 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆ కార్యక్రమంలో హాజరైన ప్రతీ రైతుకు టీ, స్నాక్స్‌ను ఏఈవోలే అందించారు. ఇందుకోసం వారే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఎపుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటే.. తీరా మరోసారి అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేది లేక మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తూ.. చేతి చమురు వదిలించేందుకు సిద్ధమవుతున్నారు.

ఏఈవోలపై పనిభారం..

వాస్తవానికి ప్రతీ రైతు వేదికలో ఒకే ఒక ఏఈవో ఉంటారు. రైతులకు సంబంధించిన ప్రతీ విషయం వీరే చేసుకోవాలి. పంటలకు సంబంధించి ఎప్పటికపుడు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం. సాగులో సమస్యలు తలెత్తితే పరిష్కరించడం. పీఎం కిసాన్‌ యోజనకు సంబంధించి కేవైసీ డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, రైతు విశిష్ట సంఖ్య నమోదు చేయడం, పంటల నమోదు చేయడం, రైతుబంధు, రైతు బీమా నమోదు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మట్టి నమూనాల సేకరణ తదితర పనులు ఉంటాయి. ఇవి కాకుండా రైతు వేదిక నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకుంటారు. వీరు తప్ప మరే ఇతర సిబ్బంది లేకపోవడంతో వీరే ఉదయం వచ్చి రైతు వేదికను ఊడ్చుకోవాలి, కార్యక్రమాలు జరిగినపుడు కుర్చీలు వేయడం, వారికి టీ స్నాక్స్‌.. కూడా వీరే అందించాల్సి వస్తోంది. అధికారిక కార్యక్రమాలు జరిగినపుడు వచ్చిన వారంతా మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. తరువాత డబ్బులు ఇచ్చి వాటిని శుభ్రం చేయించుకోవాల్సి వస్తోంది. మొత్తానికి ఏఈవోలు నిర్వహించే ప్రతీ అధికారిక కార్యక్రమం ఇంట్లో చేసే శుభకార్యంలా ప్రతీది దగ్గరుండి చూసుకోవాల్సిన స్థితి. ఈ విషయమై పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డిని వివరణ కోరగా.. ఏఈవోలకు రైతుల తరలింపు విషయంలో ఎలాంటి టార్గెట్‌ విధించలేదని, వారే స్వచ్ఛందంగా వస్తున్నారని సమర్థించుకున్నారు.

జిల్లా రైతు వేదికలు ఏఈవోలు

కరీంనగర్‌ 75 71

జగిత్యాల 52 71

పెద్దపల్లి 54 52

సిరిసిల్ల 57 53

రైతు వేదికల్లో ఇబ్బందులివీ!

చాలాచోట్ల తాగునీరు సదుపాయం లేదు

కుర్చీలు వేసే సిబ్బంది లేరు

టీ, స్నాక్స్‌ ఇచ్చే దిక్కు లేదు

మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు

వేదికకు కనీసం ఊడ్చే సిబ్బంది లేరు

టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్‌కు డబ్బులు రావు, నిర్వహణకు సిబ్బంది లేరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement