
అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్
● కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్
కరీంనగర్టౌన్: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కొనియాడారు. ఒకే దేశం.. ఒకే జెండా.. ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్టికల్ రద్దు కోసం బలిదానమయ్యారన్నారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా.. ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ అని స్మరించుకున్నారు. సోమవారం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంతకుముందు తన మాతృమూర్తితో కలిసి మొక్కను నాటారు. దేశం కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని జనసంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి పంపిన వీరుడుగా చర్రితలో నిలిచాడన్నారు. దేశ ప్రజలంతా మోదీ సర్కార్కు అండగా నిలిచి భారత్ను విశ్వగురు స్థానంలో నిలపాలనే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, మాజీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, నాయకులు హాజరయ్యారు.