
మహిళలు గర్వపడేలా చీరలుండాలి
సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టుకునేలా సిరిసిల్ల నేతన్నలు నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల ఏఎంసీ గోదాంలో సోమవారం ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణకు శ్రీకారం చుట్టారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేతన్నలు, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గతంలో కంటే మెరుగైన ఆర్డర్లను ఇచ్చామని, సకాలంలో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి సిరిసిల్ల పేరు నిలబెట్టాలన్నారు. వేములవాడలో రూ.50కోట్లతో నూలుడిపోను ఏర్పాటు చేసి 90 శాతం అరువుపై అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుల రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. నేతన్నలకు 4.30 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 65 లక్షల మీటర్లు తయారు చేశారని, జూన్ నెలాఖరులోగా 50 శాతం పూర్తి చేయాలని సూచించారు.
రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి
వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ.150కోట్లతో నాలుగు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికే రూ.47.98కోట్లు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయని, సిరిసిల్లలో పద్మశాలీ భవన్ను రూ.5కోట్లు, సిరిసిల్ల సంఘాల నుంచి మరో రూ.3కోట్లు సేకరించి రూ.8 కోట్లతో నిర్మిస్తామని, మార్కండేయ ఆలయాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ చీరల ఆర్డర్ను సకాలంలో పూర్తి చేయాలని, జూన్ నెలాఖరు నాటికి సగం ఆర్డర్ పూర్తి చేయాలని సూచించారు. సేకరణ పూర్తికాగానే ఉత్పత్తి చేసిన బట్టకు బిల్లులు అందుతాయని వెల్లడించారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, చేనేత, జౌళి శాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, ఏడీ రాఘవరావు, డీడీ రవీందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, కాముని వనిత, కల్లూరి చందన, వస్త్రోత్పత్తిదారులు ఆడెపు భాస్కర్, గోవిందు రవి, మంచె శ్రీనివాస్, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, మాజీ కౌన్సిలర్లు, జౌళిశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవంతో వాటిని కట్టుకోవాలి
రాష్ట్రమంతటికి సిరిసిల్ల చీరలు
సకాలంలో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి
రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి
సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్