
న్యాయవాద శిక్షణకు ఊతం
● ఉపకార వేతనం, గ్రాంట్ అందజేయనున్న ప్రభుత్వం
● ఎస్సీలకు సదావకాశం
● 36 నెలలపాటు నెలకు రూ.3వేల చొప్పున చెల్లింపు
● బార్ కౌన్సిల్ అడ్మిషన్ ఫీజు సైతం..
కరీంనగర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో మూడు సంవత్సరాల శిక్షణ పొందేందుకు ఎంపిక చేసిన లా–పట్టుభద్రులు సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనం, గ్రాంట్ ఎంతో దోహదపడుతుంది. ఎస్సీ కులాలకు చెందిన న్యాయవాదులకు ఆర్థిక సహకారమందించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్సు పూర్తి చేయడమే కాకుండా.. కేసులు ఎలా వాదించాలి.. దానికి సంబంధించిన పత్రాలను ఎలా సిద్ధం చేయాలి.. పేషీల అనుశీలన.. న్యాయమూర్తి తీర్పు ప్రతి గురించి తెలుసుకోవడం ఇవన్నీ న్యాయవాద వృత్తిలో భాగాలే. వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే జూనియర్లు సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ పొందడం తప్పనిసరి. తద్వారా పట్టు సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఇలా శిక్షణ పొందడం కొంత ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ఎస్సీ కులాలకు చెందిన న్యాయవాదులకు తగిన స్లయిఫండ్, గ్రాంట్ను అందిస్తోంది. ఇటీవల ఈ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా న్యాయవాదులు తగిన శిక్షణ పొందేందుకు దోహదపడుతుంది. న్యాయవాద వృత్తి చేపట్టే వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతోంది. ఇంటర్ తర్వాత ఐదేళ్లు, డిగ్రీ తర్వాత మూడేళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేకత కోసం ఎల్ఎల్ఎం కోర్సును అభ్యసిస్తారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారు న్యాయవాద వృత్తిలో రాణించాలంటే సీనియర్ల వద్ద శిక్షణ తప్పనిసరి. కొన్ని నెలలపాటు వారి వద్ద సెక్షన్లు, కేసులు, వాటి పూర్వాపరాలు, బెయిల్ మంజూరు, శిక్ష, జరిమానాలు ఇలా అన్ని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు వీలు కలుగుతుంది.
పెరిగిన సహకారం
న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టిన వారు సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు ఖర్చవుతుంది. పుస్తకాలు, నల్ల కోటు, కంప్యూటర్ తదితర వాటిని కొనుగోలు చేయాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి ఆర్థిక సహకారమందించాలని నిర్ణయించి కొన్నేళ్లుగా ఆ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇచ్చే గ్రాంట్, ఉపకార వేతనాన్ని పెంచారు. గత సంవత్సరం వరకు ప్రతి నెలా రూ.వెయ్యి ఉపకార వేతనాన్ని 36 నెలలపాటు అందజేసేవారు. దీనికితోడు వన్ టైం గ్రాంట్ పేరిట రూ.6వేలు చెల్లించేవారు. ఇటీవల ఉపకార వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. వన్టైం గ్రాంటును ఏకంగా రూ.50వేలకు పెంచారు. దీనికితోడు బార్ కౌన్సిల్ నిర్ణయించిన రూ.585 అడ్మిషన్ ఫీజును సైతం షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ చెల్లిస్తుంది.
ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం
ప్రభుత్వమందిస్తున్న ఉపకార వేతనం, గ్రాంట్ కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయవాదులు అర్హులు. ఇందుకు గాను షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయవాదులు.. సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్డులో గల అంబేడ్కర్ భవన్లోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ కార్యాలయంలో జూలై 31 లోగా దరఖాస్తు చేసుకో వాలి. వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కమిటీలో జిల్లా జడ్జి, ఎస్సీ వెల్ఫేర్ డీడీ సభ్యులుగా ఉంటారు. మూడు సంవత్సరాలు సర్వీసు పైబడిన జూనియర్ న్యాయవాదులను సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 10న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 1 జూలై 2025 నాటికి 23 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సుండి, సంవత్సర ఆదాయం రూ.2లక్షలకు మించొద్దు. కులం, ఆదాయం, గ్రాడ్యుయేషన్ లా సర్టిఫికెట్లు, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న వారి ఖాతాల్లో ట్రెజరీ ద్వారా డబ్బులు అందజేయనున్నారు.