పసుపు వైపే రైతన్న చూపు | - | Sakshi
Sakshi News home page

పసుపు వైపే రైతన్న చూపు

Jun 23 2025 6:12 AM | Updated on Jun 23 2025 6:12 AM

పసుపు వైపే రైతన్న చూపు

పసుపు వైపే రైతన్న చూపు

జగిత్యాలఅగ్రికల్చర్‌: పసుపు పంటకు ఓ వైపు ప్రభుత్వ మద్దతు ధర లేకపోవడం, మరో వైపు వ్యాపారులు సిండికేట్‌గా మారి బహిరంగ మార్కెట్‌లో రేటు తగ్గించినా, పసుపు సాగుపై జిల్లా రైతుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఏయేటికాయేడు ధర వస్తుందిలే అనే ఆశతో సాగు చేస్తున్నారు. అలాగే, పసుపు క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలంటూ రైతులు ఏటా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే, రైతుల వద్ద ఉన్న పసుపు వ్యాపారుల చేతుల్లోకి పోయిన తర్వాత క్వింటాల్‌కు రూ.16–17 వేల వరకు ధర పలకడంతో, మళ్లీ అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి తోడు నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుతో ధరల్లో కదలిక వస్తుందనే ఆశతో ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు.

ఇంటి పంటగా భావించి..

పసుపు పంటకు ధర ఉన్నా, లేకున్నా ఇంటి పంటగా భావించి జిల్లాలో పలువురు రైతులు కనీసం ఎకరం నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులను ఆర్థికంగా స్థితిమంతులను చేసింది కూడా పసుపు పంటే కావడం విశేషం. అనుకూలమైన ఎర్ర నేలలు, డ్రిప్‌ ద్వారా సాగునీరు, రసాయన ఎరువులు అందించే వెసులుబాటు ఉండటంతో రైతులు పంట వైపు ఆసక్తి చూసుతున్నారు. ఇక్కడి రైతులు అధిక దిగుబడి ఇచ్చే గుంటూర్‌, ఆర్మూర్‌, కుర్కుమిన్‌ శాతం ఎక్కువ ఉండే సుగుణ, సుదర్శన్‌ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఇటీవల కొందరు అభ్యుదయ రైతులు కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉండే కేరళ రకాలను కూడా సాగు చేస్తున్నారు. అయితే, పలువురు రైతులు విత్తనాన్ని కొనుగోలు చేయకుండా, గతేడాది పంట నుంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకుని వేస్తుంటారు.

పెరిగిన సాగు ఖర్చు

పసుపు ఏడాది పంట. దాదాపు 9–10 నెలల పాటు భూమిలోనే ఉంటుంది. పంటకాలంలో అన్నీ ఖర్చులు కలుపుకుని ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల ఖర్చు వస్తుంది. ఎకరాకు ఒక లారీ కోడి ఎరువు(దాదాపు రూ.25 వేలు) వేస్తారు. రెండుమూడు సార్లు దున్నడానికి రూ.5 వేలు, విత్తనం వేసేటప్పుడు రూ.5 వేలు, రసాయన ఎరువులు రూ.8 వేలు, మూడుసార్లు కలుపు తీసేందుకు కూలీల ఖర్చు రూ.5 వేలు, తవ్వకం సమయంలో రూ.40 వేలు, ఉడకబెట్టి, ఆరబెట్టేందుకు రూ.6 వేలు, విత్తనాల ఖర్చు రూ.15 వేలు.. ఇలా అన్నీ కలుపుకుంటే రూ.లక్ష వరకు దాటుతుంది. మార్కెట్‌కు తరలించేందుకు రవాణా, అడ్తి, కమీషన్‌, క్యాష్‌ కటింగ్‌ వంటి చార్జీలు లెక్కలోకి తీసుకుంటే మరింత ఖర్చు వస్తుంది.

ధరలు పెరుగుతాయనే ఆశతో..

ఒకప్పుడు పసుపు ధరలు బంగారంతో పోటీ పడ్డాయి. రెండేళ్ల నుంచి పసుపు ధరలు కొంత మేర ఆశాజనకంగా ఉన్నాయి. క్వింటాల్‌కు రూ.10–12 వేల ధరలు పలుకుతున్నాయి. ఇటీవల క్వింటాల్‌కు రూ.16 వేల వరకు పలకడంతో రైతులు ఉత్సాహంగా సాగుకు ఉపక్రమిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కావడం, అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరిగి రానున్న రోజుల్లో ఎగుమతులు పెరుగుతాయనే ఆశతో జిల్లాలోని మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, జగిత్యాల రూరల్‌, కోరుట్ల, కథలాపూర్‌, రాయికల్‌, మేడిపల్లి మండలాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు.

ధర ఉన్నా.. లేకున్నా

జగిత్యాల జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు

పెరుగుతున్న పసుపు ధరలతో రైతుల్లో ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement