
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు యోగేశ్వరి
కరీంనగర్స్పోర్ట్స్: నల్గొండ జిల్లా నకీరేకల్లో ఈనెల 4 నుంచి 6 వరకు జరిగిన జూనియర్స్ గర్ల్స్ హ్యాండ్బాల్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ పోటీల్లో కరీంనగర్ జట్టు తరఫున ఎం.యోగేశ్వరి ప్రతిభ కనబర్చింది. ఈనెల 18 నుంచి జూలై 22 వరకు బిహార్ జరిగే జాతీయస్థాయి హ్యాండ్బాల్ హెచ్ఎఫ్ఐ పోటీలకు తెలంగాణ జట్టు తరుపున ఎంపికై నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్యామల పవన్కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఉమ్మడి కరీంనగర్ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వరరావు, బాసరవేణి లక్ష్మణ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
పిల్లర్ గుంతలో పడి వ్యక్తి మృతి
గంగాధర(చొప్పదండి): ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి పిల్లర్ గుంతలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వెంకటయ్య (71) గర్శకుర్తిలో పూజా కార్యక్రమానికి వచ్చాడు. ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో వాహనం అదుపుతప్పి ఇంటి పిల్లర్ గుంతలో పడడంతో తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని తాడికల్ గ్రామంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని అనవేని కనుకయ్య(70)మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. తాడికల్ మా ర్కండేయ కాలనీకి చెందిన కనుకయ్య కిరాణ దుకాణంలో సామగ్రి కొనుక్కుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. సమీపంలోని రైస్మిల్లులో సీసీ పుటేజీలను పరిశీలించగా, అంబాల్పూర్ నుంచి తాడికల్ వెళ్తున్న కారు ఢీకొన్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని హుజూరాబాద్ మార్చురీకి తరలించారు.
హోటళ్లలో వన్యప్రాణుల మాంసం?
వేములవాడరూరల్: ఎండ వేడికి అడవిలో ఉన్న వన్యప్రాణులు దాహం కోసం గ్రామీణ ప్రాంతాలకు తరలివస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకున్న కొంత మంది వేటగాళ్లు వన్యప్రాణులను చంపి మాంసం విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వేములవాడ మండలంలోని హన్మాజిపేట, నాంపల్లి, వట్టెంల తదితర గ్రామాల్లో వేటగాళ్లు వన్యప్రాణుల మాంసాన్ని హోటల్ యజమానులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సదరు మాంసాన్ని హోటల్ యజమానులు మద్యం ప్రియులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వన్యప్రాణులను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
కరీంనగర్కు మెహరాజ్ మృతదేహం
కరీంనగర్క్రైం: కరీంనగర్లోని కశ్మీర్గడ్డకు చెందిన మెహరాజ్(46) ఈ నెల 16న షార్జాలో మృతిచెందగా అతడి మృతదేహాన్ని ఆదివారం నగరానికి తీసుకొచ్చారు. మెహరాజ్ ఎనిమిదేళ్లుగా షార్జాలో అల్ఖైరిన్ పాఠశాలలో పాఠాలు బోధించేవాడు. అతడి కుటుంబ సభ్యులు షార్జాకు వెళ్లి వారి బంధువుల సాయంతో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు.