
సేవామూర్తులు
ప్రజా సేవే పరమార్థంగా పలువురు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం ప్రజాసేవ దినం సందర్భంగా కథనం.
దివ్యాంగుల సేవలో..
జమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలోని మారుతీనగర్లో మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలను మానసిక దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుంది. 1995లో ఐదుగురు దివ్యాంగ పిల్లలతో పాఠశాల ప్రారంభమై మానసిక దివ్యాంగ సేవా సంస్థగా రూపాంతరం చెందింది. 1997లో అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ బీఆర్ మీనా రెండెకరాల ప్రభుత్వ స్థలం కేటాయించగా, దాతల సాయంతో స్కూల్ నిర్మాణం జరిగింది.
సంతృప్తినిచ్చింది
నా ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాలనే సంకల్పంతో 1995లో నా సొంత ఇంట్లో పాఠశాల ప్రారంభించా. తర్వాత ప్రత్యేక పాఠశాల ఏర్పాటుతో 185 మంది వరకు విద్యాబుద్ధులు, శిక్షణ అందించగా ఉపాధితోపాటు వారి పనులు వారి ఇంటి వద్ద చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండడం సంతోషం కలిగించింది. దివ్యాంగులకు విద్య అందించడంతోపాటు సేవ చేయడం సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం దాతల సాయంతో పాఠశాల నిర్వహిస్తున్నం. ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేస్తే దివ్యాంగులకు మెరుగైన శిక్షణతో వారి భవిషత్తుకు బాటలు పడుతాచి. – బచ్చిరాములు,
దివ్యాంగ పేరెంట్స్ సంఘం అధ్యక్షుడు, జమ్మికుంట

సేవామూర్తులు