
కోటిలింగాలలో పురాతన నాణేలు లభ్యం
వెల్గటూర్(ధర్మపురి): శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి చెందిన కోటిలింగాలలో పురాతన నాణేలు లక్ష్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం కోటిలింగాల గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారునికి గోదావరి తీరంలో 1911 సంవత్సరానికి చెందిన ఓవైపు విక్టోరియా మహారాణి ఫొటోతో, మరోవైపు రాజు గుర్రాన్ని తోలుతున్న ఫొటోతో ఉన్న సుమారు 22 నాణేలు లభ్యమయ్యాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారుడు మాజీ సర్పంచ్ ముత్తయ్యకు తెలుపగా ఆదివారం విషయం వెలుగుచూసింది. కోటిలింగాల గ్రామంలో గతంలో జరిపిన తవ్వకాలలో శాతవాహనులకు సంబంధించిన అనేక నాణేలు, చారిత్రక అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి ప్రభుత్వం తవ్వకాలను మధ్యలో ఆపేయడంతో చాలా వరకు కోటిలింగాల చరిత్ర మరుగున పడిపోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కోటిలింగాలలో తవ్వకాలు చేపడితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక అవశేషాలు బయటపడతాయని, కోటిలింగాల గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చరిత్రకారులు చెబుతున్నారు.

కోటిలింగాలలో పురాతన నాణేలు లభ్యం