
అర్హులా.. అనర్హులా!
● చేయూత పింఛన్లపై సామాజిక తనిఖీ ● త్వరలో ఫేస్ రికగ్నైజేషన్తో పింఛన్లు
కరీంనగర్ అర్బన్: చేయూత(ఆసరా) పింఛన్లపై సామాజిక తనిఖీలు (సోషల్ ఆడిట్) చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి హామీ పనులకు ఎలాగైతే ఆడిట్ చేయిస్తున్నారో అదే తరహాలో పింఛన్లను ఆడిట్ చేయించనున్నారు. అనేక మంది అనర్హులకు పింఛన్లు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలో గతేడాది 212మంది సర్వీస్ పింఛన్తో పాటు చేయూత(ఆసరా) పింఛన్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు చేయూత పింఛన్లను రద్దు చేశారు. అనేక మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందడంతో ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
సామాజిక తనిఖీలతో అక్రమాలు బహిర్గతం
జిల్లాలో 1.23లక్షల మంది వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ ప్రాంతాల వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, నడవలేనివారు, బయోమెట్రిక్ కోసం వేలిముద్రలు నమోదు కానివారికి ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో పింఛన్లు డ్రా చేస్తున్నారు. ఈ పింఛన్లు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. పింఛన్లపై ఆడిట్ నిర్వహిస్తే అనర్హుల గుట్టు రట్టవుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు సైతం పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనర్హుల పేర్లు తొలగిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు మరికొందరు అర్హులకు కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఆధార్కార్డులో మార్పులతో అనర్హులు
ఆసరా పింఛన్ పొందుతున్న వారిలో కొందరు ఆధార్కార్డుల్లో వయసును దిద్దించారు. తమకు ఎక్కువ వయస్సు ఉందని అధికారులను నమ్మించి పింఛన్లు పొందారు. అనర్హులు పింఛన్లు పొందుతున్నారంటూ గతంలోనే కలెక్టర్కు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ వ్యవహారంలో కొందరు నేతలు సిఫార్సు చేసిన వారికి అధికారులు ఎలాంటి విచారణ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు సర్వత్రా ఆరోపణలు వినిపించాయి. లబ్ధిదారులు మృతిచెందిన వెంటనే వారికి పింఛన్ నిలిపివేయాలి. కాని పట్టణాల్లో లబ్ధిదారుడు మృతి చెందిన తర్వాత మూడునాలుగు నెలల పాటు పింఛన్లు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. కరీంనగర్, హుజూరాబాద్ కేంద్రానికి సమీపంలో ఉండే గ్రామంలో పలువురు మహిళలు ఒంటరి మహిళ పేరిట పింఛన్లు తీసుకుంటున్నారు. వాస్తవానికి వీరు వివాహమైనవారే. భర్తతో విడిపోయి తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉండడంతో మానవత్వంతో వీరికి ఒంటరి మహిళల కోటాలో పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత వీరు మళ్లీ వారి భర్తల ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ ప్రతీ నెల పుట్టింటికి వచ్చి పింఛన్ తీసుకుంటున్నారు. ఇలా అనేక మంది అనర్హులు చేయూత పింఛన్లు పొందుతున్నారు.
ముఖ ధ్రువీకరణతో పింఛన్లు
త్వరలో ‘ముఖ చిత్రం ధ్రువీకరణ’ విధానం తీసుకరావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులకు, ఉద్యోగులకు సెర్ప్ అధికారులు అవగాహన కల్పించారు. మరికొందరు వేలిముద్రలు, ఐరిష్ రాని వృద్ధుల పింఛన్లను ఆయా గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు తన వేలు ముద్రలు వేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇలాంటి అక్రమాలు అరికట్టడానికి ప్రభుత్వం మొబైల్ ఫోన్ తరహా యంతాల్లో ఫెషియల్ అథంటిఫికేషన్కు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి ముఖం చిత్రం స్కానింగ్ ద్వారా లబ్ధిదారుల పింఛన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జిల్లాలో లబ్ధిదారులు : 1,23,641
వృద్ధాప్య పింఛన్దారులు : 48,918
వితంతు : 34,229
దివ్యాంగులు : 20,702
గీత కార్మికార్మికులు : 3,767
చేనేత : 2,817
ఒంటరి మహిళలు : 3,271
బీడీ కార్మికులు : 9,937