
‘ఫీజు నియంత్రణ’ ఏది?
● ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వసూళ్లపై చర్యలు శూన్యం ● కానరాని గవర్నింగ్ బాడీ ● చోద్యం చూస్తున్న విద్యాశాఖ
కరీంనగర్: పాఠశాల స్థాయిలో ఫీజు నియంత్రణ చట్టం అమలుకు నోచుకోవడం లేదు.చట్టం తమ చుట్టమన్నట్లుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తు న్నాయి. వీరికి రాజకీయ, ధన బలం ఉండడంతో.. ఫీజు నియంత్రణపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయడంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చట్టం ఏం చెబుతోంది..
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి విద్యనందించాలి. పాఠశాల స్థాయిలో ఫీజు నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అందినకాడికి దో చుకుంటున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తు న్నా వీటివైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడం పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది.
ఊసే లేని గవర్నింగ్ బాడీ
ట్రస్టు పేరుతో పాఠశాలను ఏర్పాటు చేస్తేనే ఆ విద్యాసంస్థకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. అలా ఏర్పాటైన పాఠశాలకు తప్పనిసరిగా గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. ట్రస్టు చైర్మన్, కరస్పాండెంట్, హెచ్ఎం, టీచర్, పేరెంట్తో గవర్నింగ్ బాడీని నియమించి.. ఏయే తరగతులకు ఎంత ఫీజు తీసుకోవాలి.. అర్హత మేరకు ఉపాధ్యాయులకు జీతం ఎంత చెల్లించాలనే నిర్ణయం తీసుకోవాలి. ఒక్క కరీంనగర్లోనే ప్రైవేట్, కార్పొరేట్ కలిపి దాదాపు 200 వరకు పాఠశాలలున్నాయి. కొన్ని పాఠశాలల్లో పేపర్పై మాత్రమే గవర్నింగ్ బాడీని చూపించి.. మిగిలిన పనులను యాజమాన్యమే చక్కదిద్దుకుంటోంది.
కానరాని ఫీజు పట్టిక
ప్రతి పాఠశాలలో తరగతివారీగా ఫీజు వివరాల ను నోటీసు బోర్డులో ఉంచాలి. ఉపాధ్యాయుల అర్హత వివరాలను పొందుపరచాలి. చాలా పాఠశాలల్లో ఫీజు పట్టికను ఏర్పాటు చేయడం లేదు. ఫీజు నియంత్రణ అంశంపై సాధారణ ప్రజలకు తెలియకపోవడం సాధారణం. అయితే విద్యావంతులైన అధికారులకు ఫీజు నియంత్రణ చట్టంపై కొంత వరకై నా అవగాహన ఉంటుంది. అయినా వారు నోరు మెదపకపోవడంపై సర్వ త్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ధారాదత్తం చేయడానికే..
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళా శాలల్లో అత్యధిక భాగం రాజకీయ నాయకులు, ప్రముఖులవే కావడంతో ఫీజు నియంత్రణ చట్ట మున్నా అమలు చేయడం లేదంటూ విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. అధికారులు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. గుర్తింపు లేకున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.