
ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి చెట్ల పెంపకం
● చింతకుంటలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో మంత్రి పొన్నం
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి చెట్ల పెంపకానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని, ప్రభుత్వ స్థలాలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చింతకుంటలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద కల్లు గీత కార్మిక సొసైటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల తాటి, ఈత మొక్కలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా ఈ మొక్కలను ఈ ఏడాది నాటాలని సూచించారు. చింతకుంటలో కల్లు కంపౌండ్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గోల్కొండను పాలించిన మొట్టమొదటి తెలంగాణ రాజు పాపన్నగౌడ్ అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ భావితరాలకు స్ఫూర్తిదాయంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, సర్వాయి పాపన్న గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరుశరాంగౌడ్, జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పొన్నం సత్యనారా యణ గౌడ్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల స్వామిగౌడ్, నాయకులు పెరుమాండ్ల రామస్వామి గౌడ్, పిల్లి మహేశ్గౌడ్, బొమ్మ ఈశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.