
ప్రపంచ అగ్రదేశంగా భారత్
జగిత్యాలటౌన్: పదకొండేళ్ల నరేంద్రమోదీ పాలనలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరించిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే నాలుగో ఆర్థికశక్తిగా అవతరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు దేశ భద్రత విషయంలో మోదీ రాజీలేని పాలన సాగిస్తున్నారని కొనియాడారు. దేశం వైపు కన్నెత్తి చూసేందుకు శత్రుదేశాలు సాహసం చేయలేని విధంగా అజేయశక్తిగా తీర్చిదిద్దిన ఘనత మోదీదన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ పాలనపై రూపొందించిన 11సాల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు రాగిళ్ల సత్యనారాయణ, కస్తూరి సత్యం, మరిపెల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి