
దోపిడీలో ఆ పార్టీలన్నీ ఒక్కటే
సిరిసిల్లటౌన్: చట్టాలను అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడడంలో అధికారం చేపట్టిన, చేపడుతున్న పార్టీలన్నీ ఒక్కటేనని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సిరిసిల్లలోని లహరి గ్రాండ్ ఫంక్షన్హాలులో సోమవారం సీపీఐ నాలుగో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ బెటర్ అనుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. పౌరుషానికి ప్రతీకగా రాజన్న క్షేత్రం..పోరాటాల ఖిల్లాగా సిరిసిల్ల నిలుస్తాయని కొనియాడారు. దున్నేవాడికే భూమి పేరుతో వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం ఉద్యమించిన చరిత్ర సిరిసిల్లకు ఉందన్నారు. కార్మిక హక్కులను కాలరాయడంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు మూడూ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులు నికార్సయిన ఉద్యమకారులని, నిస్వార్థంగా ప్రజల పక్షాన పోరాడుతారన్నారు.
హామీలు అమలు చేయాలి: చాడ వెంకట్రెడ్డి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో ఆదివాసీ బిడ్డలను అంతం చేసే కార్యక్రమాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల్లో పార్టీ ప్రతినిధులను వీలైనంత ఎక్కువ మందిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, నాయకులు కడారి రాములు, పంతం రవి, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సభల్లో సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఇల్లంతకుంటకు చెందిన మంద సుదర్శన్తోపాటు 25మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తదితరులు పాల్గొన్నారు.
చట్టాల అడ్డుతో అడ్డగోలు వ్యవహారాలు
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే కూనంనేని
సిరిసిల్లలో సీపీఐ నాలుగో మహాసభలు