● పురుగుల మందు డబ్బాతో రోడ్డెక్కిన గిరిజన కుటుంబం
చందుర్తి(వేములవాడ): పంట చేనులోకి వెళ్లకుండా తన బావనే అడ్డుకుంటున్నాడని రుద్రంగి పోలీసులకు ఫిర్యాదు చేసి 45 రోజులు గడుస్తున్నా న్యాయం చేయడం లేదంటూ చందుర్తి బస్టాండ్ వద్ద పురుగుల మందు డబ్బాతో ఓ గిరిజన రైతు కుటుంబం సోమవారం రోడ్డెక్కింది. బాధితుడు తిరుపతినాయక్ కథనం ప్రకారం వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండాకు చెందిన గుగులోతు తిరుపతినాయక్ తన బావ భూక్య శరమన్ పంట చేనులోకి వెళ్లకుండా అడ్డు తగులుతున్నాడని గత నెల 23న రుద్రంగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమకు న్యాయం చేయకుండా బంధువులే కదా అని కలిసి ఉండాలని ఉచిత సలహా ఇచ్చి పంపారన్నారు. రెండు రోజుల క్రితం వర్షం పడడంతో చేను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకెళ్తే దారి లేదని వెనక్కి పంపినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి సోమవారం రుద్రంగి పోలీసు స్టేషన్కు వెళ్తే పట్టించుకోకపోవడంతోనే చందుర్తి సీఐకి ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు వివరించాడు. సీఐ వెంకటేశ్వర్లు వేములవాడ బందోబస్తు డ్యూటీలో ఉన్నారని తెలపడంతో తిరుపతి తన భార్య సుమలత, కుమారుడు మోక్షిత్, కూతుళ్లు మేఘన, మనశ్రీ, తల్లితో కలిసి పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న చందుర్తి పోలీసులు హుటాహుటిన బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని పురుగుల మందు డబ్బాను లాక్కొని.. మంగళవారం వస్తే సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పి పంపించి వేశారు.