రైతు భరోసా వచ్చిందోచ్‌ | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా వచ్చిందోచ్‌

Jun 17 2025 5:24 AM | Updated on Jun 17 2025 5:24 AM

రైతు భరోసా వచ్చిందోచ్‌

రైతు భరోసా వచ్చిందోచ్‌

కరీంనగర్‌ అర్బన్‌: రైతు భరోసా (రైతుబంధు) సాయం విడుదలైంది. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాత్రి నుంచే రైతుల ఖాతాకు భరోసా సాయం చేరుతోంది. గత పట్టాదారుల సంఖ్యతో పాటు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేశారు. గతంలో మాదిరి చిన్న, సన్నకారు రైతులని కాకుండా అందరి ఖాతాలకు భరోసా సాయం అందనుందని అధికారులు వెల్లడించారు.

వానాకాలం భరోసా లేనట్టే?

గత వానాకాలం రైతు భరోసా ఇప్పటికీ రైతుల ఖాతాకు రాలేదు. యాసంగి సీజన్‌కు సంబంధించి 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా చేరింది. ఆపై భూ విస్తీర్ణం ఉన్నవారికి ఇప్పటికీ నిరీక్షణే. యాసంగి ప్రారంభమైన రెండు నెలలకు సదరు సాయం అందగా ఈ సారి సకాలంలో సాయమందడం ఆహ్వానించదగ్గ పరిణామం.

మరోసారి అవకాశం

రైతు భరోసా పొందేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశమిచ్చింది. జూన్‌ 5, 2025 వరకు ఆన్‌లైన్‌లో నమోదైన వారందరికీ సాయం అందనుంది. ఈ నెల 20వరకు దరఖాస్తుకు అవకాశమివ్వగా వ్యవసాయ అధికారులు రైతులకు సమాచారం చేరేలా చర్యలు చేపడుతున్నారు. గత సీజన్లలో డబ్బులు జమయి ప్రస్తుతం అసలే రాకపోయినా లేదా ఉన్న భూ విస్తీర్ణం కంటే తక్కువ భూమికి డబ్బు జమయినా, రైతుబంధు పోర్టల్‌లో పేరు కనిపించి బ్యాంకు ఖాతా వివరాలు ఇప్పటికీ ఇవ్వకపోయినా, బ్యాంకు వివరాలు తప్పుగా నమోదు కావడం, ఇతర కారణాల వల్ల డీబీటీ ఫెయిల్‌ అని మీకు సందేశం వచ్చి న వెంటనే దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలతో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.

సాగుకు యోగ్యం కాని భూములకు లేనట్టే

జిల్లాలో 77 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈవో, రెవెన్యూ అధికారి సంయుక్తంగా సర్వే చేపట్టి 5,608 ఎకరాల భూమి సాగుకు పనికిరాదని తేల్చారు. నాన్‌అగ్రికల్చర్‌ ల్యాండ్‌, పలు స్థలాలు రాళ్లు, రప్పలు, గ్రానైట్‌, క్వారీలు తదితర ఉన్నాయని గుర్తించారు. 2018 మే 10న రైతు బంధు ప్రారంభమవగా సదరు గణాంకాల ప్రకారం రూ.33కోట్లు దుర్వినియోగమయ్యాయని స్పష్టమవుతోంది. ప్రధాన రహదారులు, కాలువలకు వెళ్లిన భూములు, సర్వేనంబర్లవారీగా రాళ్లూరప్పలున్న భూములు కూడా రైతుల పేరిటే ఉన్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట పట్టా చేయగా, జిల్లాలోని పలుచోట్ల ఇలాగే ప్రభుత్వభూమి చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా పలు ప్రాంతాల్లో భూస్వాములు గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, ఇతరత్రా వాటికి భూములను దానంగా, ఇనాంగా ఇచ్చారు. కాలక్రమంలో వాటిని మ్యుటేషన్‌ చేయకపోవడంతో గత ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలున్నా ఆన్లైన్లో మాత్రం ఆ భూములిచ్చిన వారి పేరే నమోదైంది. దీంతో రైస్‌ మిల్లులు, ఇటుకబట్టీలు, బీడుభూములూ పోర్టల్‌లో వ్యవసాయ భూములుగానే నమోదవడంతో వీరందరికీ రైతు బంధు డబ్బులు జమయ్యాయి. సాగుకు యోగ్యం కాని భూముల సర్వేనంబర్లతో పాటు విస్తీర్ణం వివరాలను అధికారులు రైతుభరోసా పోర్టల్లో ఫ్రీజింగ్‌ చేశారు.

జిల్లాకు రూ.138 కోట్లు విడుదల

మరో వైపు దరఖాస్తుల స్వీకరణ

ఈ నెల 20వరకు అవకాశం

జిల్లాలో..

రెవెన్యూ గ్రామాలు 206

పోర్టల్‌లో పట్టాదారులు 2,10,904

విడుదలవ్వాల్సిన నగదు రూ.211.90కోట్లు

ఖాతాలిచ్చినవారు 1,94,184

ట్రెజరీకి చేరిన నగదు రూ.139.08కోట్లు

లబ్ధిపొందనున్న రైతులు 1,68,218

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement