
డివిజన్ల ఫైనల్ లిస్ట్ రెడీ
● నేడు కలెక్టర్ వద్దకు జాబితా ● రెండు రోజుల్లోనూ సవరణలకు చాన్స్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివిజన్ల పునర్విభజన జాబితా దాదాపుగా పూర్తయింది. క్షేత్రస్థాయిలో అభ్యంతరాల పరిశీలన సోమవారంతో ముగియగా, రాత్రి వరకు తుది జాబితా రూపొందించేందుకు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయి, పట్టణ ప్రణాళిక అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం కలెక్టర్కు జాబితా అందజేయనుండగా, కలెక్టర్ ఆమోదించేందుకు ముందు సవరణలకు కూడా అవకాశం ఉంది.
అభ్యంతరాల పరిశీలన పూర్తి
66 డివిజన్ల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన సోమవారం ముగిసింది. ఈ నెల 5 నుంచి అభ్యంతరాలు వస్తున్న క్రమంలోనే ఆయా డివిజన్లలో అధికారులు పరిశీలన మొదలు పెట్టారు. దీంతో ఇప్పటికే పరిశీలన, వాటి పరిష్కారం వైపు చర్యలు దాదాపు పూర్తయ్యాయి. తుది జాబితా పకడ్బందీగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు, తప్పులకు తావివ్వొద్దని కమిషనర్ ప్రఫుల్ దేశాయి హెచ్చరికలు జారీ చేయడంతో, ఒకటికి నాలుగు సార్లు టౌన్ప్లానింగ్ అధికారులు జాబితాను పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి వరకు జాబితాకు తుది రూపు ఇచ్చినట్లు సమాచారం.
నేడు కలెక్టర్ వద్దకు..
అభ్యంతరాల పరిశీలన అనంతరం నగరపాలకసంస్థ రూపొందించిన 66 డివిజన్ల తుది జాబితా మంగళవారం జిల్లా కలెక్టర్కు అందించనున్నారు. మంగళ, బుధ వారాల్లో కలెక్టర్ పరిశీలన అనంతరం 19న సీడీఎంఏకు తుది జాబితా పంపించాల్సి ఉంది. అయితే రెండురోజుల కలెక్టర్ పరిశీలనలోనూ అవసరమైతే సవరణలకు అవకాశం ఉంది. కాగా కలెక్టర్కు స్వల్ప శస్త్రచికిత్స కావడంతో ఆమె బుధవారం జాబి తాను పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాశం ఉన్న ట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం జాబితాను క్షుణ్ణంగా మరోసారి పరిశీలించి, కలెక్టర్ ఆమోదానికి పంపించే అవకాశం ఉంది.