
పోలీస్శాఖకు ఎంపికవడం అదృష్టం
కరీంనగర్క్రైం: పోలీసు అనేది ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసేందుకు లభించిన మంచి అవకాశమని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అన్నారు. నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో 9 నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పోలీస్శాఖకు ఎంపికవడం అదృష్టమన్నారు. శిక్షణను క్రమశిక్షణతో నేర్చుకోవాలని , ఇందులో నేర్చుకునే అంశాలే సర్వీసులో ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాలపై అవగాహనతో పాటు ఆయుధాలపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారని వివరించారు. ముఖ్యంగా పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకునే చర్యలపై శిక్షణ ఇస్తారని, వాటిని సమర్థవంతంగా అందిపుచ్చుకోవాలన్నారు. కాగా, గతంలో వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో ఎంపికై వివిధ కారణాలతో శిక్షణకు వెళ్లలేని వివిధ విభాగాలకు చెందిన 91 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ అందించనున్నారు. కార్యక్రమంలో పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అడిషనల్ ఎస్పీ ఎం.పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపాల్ బి. మోహన్ (డీఎస్పీ), డీఎస్పీలు మల్లికార్జున్, మహేశ్బాబు, శ్రీనివాస్, విజయపాల్రెడ్డి, గంగాధర్, శివరామయ్య పాల్గొన్నారు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు శిక్షణ
కరీంనగర్లోని వివిధ పోలీస్స్టేషన్లలో సెక్టార్, ఇన్వెస్టిగేషన్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న 35మంది ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లకు సోమవారం సీటీసీలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం హాజరై మాట్లాడారు. శిక్షణలో భాగంగా ఫిర్యాదు అందుకోవడం నుంచి ఎఫ్ఐఆర్ నమోదు, ఇన్వెస్టిగేటింగ్ విధానం, క్రైం సీన్ సందర్శన, సాక్ష్యాధారాలు సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించేలా శిక్షణనిస్తున్నామన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ సంతోష్కుమార్, శ్రీనివాస్, సరిలాల్, బిల్లా కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
● సీపీ గౌస్ ఆలం