
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
మల్లాపూర్(కోరుట్ల): ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఏడారి దేశానికి వలస వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందగా, 12 రోజులకు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. వివరాలు.. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నారి సాయన్న–నర్సవ్వకు కుమార్తె, కుమారుడు తుక్కారాం(35) సంతానం. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు తుక్కారాం జీవనోపాధికోసం కొద్దిరోజుల క్రితం మలేషియాకు వలస వెళ్లాడు. ఈ నెల 3న అక్కడ గుండెపోటుతో మృతిచెందాడు. శనివారం తుక్కారం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా కుటుంబసభ్యుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది. అంతిమయాత్రలో చిన్ననాటి మిత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.