
గొర్ల కొట్టంగా అంగన్వాడీ కేంద్రం
చిగురుమామిడి: ప్రభుత్వ సొమ్ము పరుల పాలవుతోంది. చిన్నారులు చదువుకోవాల్సిన భవనాల్లో జీవాలు సేదతీరుతున్నాయి. నిధులు లేక భవనాల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోగా.. పశువుల పాకలుగా.. గొర్ల కొట్టాలుగా మారుతున్నాయి. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని అంగన్వాడీ నూతనభవనం గొర్రెల కొట్టంగా మారింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల భవనం ఆవరణలో కొన్నేళ్లుగా అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం మంజూరైంది. నిధుల కొరతతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఖాళీగా ఉన్న భవనంలో గ్రామానికి చెందిన కొందరు గొర్రెల మందలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు చదువుకునేందుకు ఉపయోగపడే భవనాన్ని గొర్ల కొట్టంగా మార్చారు. కొన్ని నెలలుగా ఇదే తంతు సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తుల తెలిపారు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.