ఎందుకిలా.. ఎన్నాళ్లిలా! | - | Sakshi
Sakshi News home page

ఎందుకిలా.. ఎన్నాళ్లిలా!

May 4 2025 6:35 AM | Updated on May 4 2025 6:35 AM

ఎందుక

ఎందుకిలా.. ఎన్నాళ్లిలా!

● పింఛన్‌ జమలో జాప్యం ● ఏప్రిల్‌ డబ్బుల కోసం పండుటాకుల పడిగాపులు ● ఇక ముఖ గుర్తింపుతో అందజేత

కరీంనగర్‌అర్బన్‌:

చేయూత పింఛన్‌ డబ్బు జమలో జాప్యం అనుమానాలకు తావిస్తోంది. గత మార్చి పింఛన్లు నెల దాటాక లబ్ధిదారులకు చేరగా ఏప్రిల్‌ నెలదీ అదే పరిస్థితి. ప్రతి నెలా ఠంఛన్‌గా రావాల్సి న పింఛన్‌ నెల దాటినా దిక్కులేకపోవడంతో లబ్ధి దారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రతి నెలా తొలివారంలోనే డబ్బులొచ్చేవి. క్రమేణా నెలాఖరుకు చేరగా తాజాగా నెల దాటినా పింఛన్‌ రాకపోవడం ఆందోళనకర పరిణామం. పింఛన్‌పైనే ఆధారపడి జీవించే వృద్ధులు లేకపోలేదు. నెలనెలా కుటుంబ పోషణ ఖర్చులకు ఉపయోగపడుతాయ ని భావించిన లబ్ధిదారులకు జాప్యం ఆశనిపాతంగా మారింది. అధికారులను సంప్రదిస్తే డబ్బులు వస్తాయని చెబుతున్నారని, తీరా మే నెల రావడంతో గందరగోళం నెలకొంది.

లక్షమంది పడిగాపులు

జిల్లాలో చేయూత పింఛన్ల కింద 1,23,641 మంది లబ్ధిపొందుతున్నారు. దివ్యాంగులకు రూ.3,016, ఇతర పింఛన్లకు రూ.2,016 ప్రతినెలా చెల్లిస్తున్నా రు. కాగా గత ఏడు నెలలుగా సకాలంలో పింఛను రాకపోవడంతో సంబంధిత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. 2020 వరకు ప్రతి నెల 1 లేదా రెండో తారీఖున పింఛన్‌ ఖాతాకు చేరేది. కుటుంబ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేసుకునేవారు. కాగా నెలల తరబడి నిర్లక్ష్యం వేళ్లూనుకోవడంతో సాంత్వన కలిగించేవారే కరువయ్యారు. పింఛన్‌ కోసం బ్యాంకుకు వెళ్లడం.. రాలేదన్న సమాచారంతో నిరాశగా వెనుదిరగడం లబ్ధిదారుల వంతవుతోంది.

ఇక ముఖ గుర్తింపుతో పింఛన్లు

ఇకనుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియలో నూతన విధానం అమలుకానుంది. అనర్హులను తొలగించడంతో పాటు జవాబుదారితనం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మే నెల నుంచి ముఖ గుర్తింపుతో పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ విధానాన్ని(ముఖ గుర్తింపు) కొత్తగా తీసుకొస్తోంది. సెర్ఫ్‌ కొత్త యాప్‌ను రూపొందించగా వీలైనంత త్వరలో కార్యక్షేత్రంలో అమలవనుంది.

భౌతిక వెరిఫికేషన్‌

బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్రలు రాని వారికి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వారి వేలిముద్రలను వేసిలబ్ధిదారుల ఇంటికి వెళ్లి డబ్బులు అందజేస్తున్నారు. సదరు విధానంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో సర్కారు కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. పింఛన్ల పంపిణీకి ప్రత్యేకంగా రూపొందిస్తున్న యాప్‌లో లబ్ధిదారుల ఫొటోలను ప్రతి నెలా తీసుకుంటారు. ముఖ్యంగా పురపాలికల్లోని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా పింఛన్‌ డబ్బులు జమ చేస్తున్నారు. ఎవరైనా లబ్ధిదారుడు మరణిస్తే అతని పింఛన్‌ వెంటనే రద్దు కావడం లేదు. కొందరికి మూడునెలలు, మరికొందరి ఖాతాల్లో ఆరునెలల వరకు పింఛన్‌ డబ్బులు జమైన సంఘటనలు ఉన్నాయి. అందుకే సర్కారు కొత్తగా ముఖ గుర్తింపు విధానం తీసుకువస్తుంది. పల్లెలు, పట్టణాలకు చెందిన లబ్ధిదారులు ఎవరైనా సరే యాప్‌లో ఫొటో తీసి అప్‌ లోడ్‌ చేస్తేనే పింఛన్‌ మంజూరవుతుంది.

మందులకు పైసల్లేవు

ఎప్పుడైనా ప్రతినెల మొదటివారంలో పింఛన్‌ డబ్బులు వచ్చేవి. కొన్ని నెలలుగా వచ్చే పింఛన్‌ అవసరానికి ఉపయోగపడటం లేదు. నెలాఖరుకు వేస్తున్నారు. ఇప్పుడేమో అవీ దిక్కులేదు. ఏప్రిల్‌ దాటినా డబ్బు రాలే. ప్రతినెల మందులు వాడాలి. ఇప్పుడేమో చేతిలో డబ్బులు లేవు.

– రాజయ్య, ముగ్ధుంపూర్‌

జిల్లాలో..

మొత్తం లబ్ధిదారులు 1,23,641

వృద్ధాప్య 48,918

వితంతు 34,229

దివ్యాంగులు 20,702

గీతకార్మికులు 3,767

చేనేత 2,817

ఒంటరి మహిళ 3,271

బీడీ కార్మికులు 9,937

ఎందుకిలా.. ఎన్నాళ్లిలా!1
1/1

ఎందుకిలా.. ఎన్నాళ్లిలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement