
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్స్పోర్ట్స్/కొత్తపల్లి(కరీంనగర్)/రామడుగు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సీతారాంపూర్లోని ఐవీవై పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐవీవై పాఠశాల సహకారంతో 40మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 30రోజుల పాటు కంప్యూటర్ అప్లికేషన్స్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఎక్కువ మంది వస్తే మరో బ్యాచ్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఈవీవై స్కూల్ చైర్మన్ పసుల మహేశ్, కో చైర్మన్ శ్రీపాల్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రామడుగు మండలంలోని వెదిర పరిధిలో ఉన్న అల్ఫోర్స్ పాఠశాలలో జరుగుతున్న ఒలింపియాడ్ ఫౌండేషన్ జిల్లాస్థాయి తరగతుల రెండోఫేస్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పలు అంశాలపైన ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అల్ఫోర్స్ ఆధినేత వి.నరేందర్రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరి పాల్గొన్నారు.
పక్కాగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం రెవెన్యూ మంత్రి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడగా జిల్లా పరిస్థితిని వివరించారు. అన్ని మండలాల్లో భూభారతి కొత్త ఆర్వోఆర్ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. 10,568 ఇందిరమ్మ దరఖాస్తుల విచారణ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 4న జరిగే నీట్ పరీక్షల కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మికిరణ్, నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్పేయ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.