
హైకమాండ్ వద్దకు ‘పురుమల్ల’ పంచాయితీ
● పీసీసీ అధ్యక్షుడిని కలిసి మంత్రి పొన్నం వర్గీయుల ఫిర్యాదు ● దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న పురుమల్ల శ్రీనివాస్
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న కరీంనగర్ పంచాయితీ అధిష్టానం వద్దకు చేరింది. ఇటీవల డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నెలకొన్న గొడవను ఇరువర్గాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాయి. ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్గౌడ్ను కలిసి పొన్నం వర్గీయులు ఫిర్యాదు చేయగా, తనపై దాడిచేసిన వారిపై చర్యతీసుకోవాలని పురుమల్ల శ్రీనివాస్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమల్ల శ్రీనివాస్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్కుమార్, రాచకొండ చక్రధర్రావు, బోనాల శ్రీనివాస్, ఎస్.ఏ.మోసిన్ మహేశ్కుమార్ గౌడ్ను కలిసి కోరారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పురుమల్ల శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జీ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిని కలిశారు. పురుమల్ల శ్రీనివాస్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి, పీసీసీ కార్యదర్శి రహమత్ హుస్సేన్ డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై పురుమల్ల చేసిన ఆరోపణలను ఖండించారు. పార్టీలో పురుమల్ల పారాచూట్ నాయకుడని విమర్శించారు.