
కరీంనగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయండి
కరీంనగర్టౌన్: జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్ స్టేడియంలో రూ.10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. శాతవాహన వర్శిటీలో ఖేలో ఇండియా కింద మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్.. మూడు అంశాలపై చర్చించారు. కరీంనగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు అనివార్యమని బండి అన్నారు. మెడికల్ హబ్గా మారిన నగరానికి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని, బీడీ, నేత కార్మికులతోపాటు వివిధ రంగాల్లో కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఈఎస్ఐ సౌకర్యం లేక వారందరు వైద్య చికిత్సకు నోచుకోవడం లేదన్నారు. అదేవిధంగా నగరంలోని అంబేడ్కర్ స్టేడియానికి నిత్యం వేలాది మంది వస్తుంటారని, వారికోసం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని బండి కోరారు. ఖేలో ఇండియా పథకం కింద శాతవాహన వర్శిటీలో రూ.16 కోట్ల వ్యయంతో మల్టీ పర్పస్హాల్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. స్పందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల వర్శిటీని సందర్శించి మల్టీపర్పస్ హాల్ సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ.. ఈఎస్ఐ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపామని, ఆమోదం లభించిన వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్, శాతవాహన వర్శిటీలో మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు అంశాలను త్వరితగతిన పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.
అంబేడ్కర్ స్టేడియానికి సింథటిక్ ట్రాక్ మంజూరు చేయండి
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు బండి సంజయ్ వినతి