అన్నదాతపై హమాలీ భారం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతపై హమాలీ భారం

Apr 21 2025 8:17 AM | Updated on Apr 21 2025 8:17 AM

అన్నదాతపై హమాలీ భారం

అన్నదాతపై హమాలీ భారం

వీణవంక(హుజూరాబాద్‌): ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే హమాలీ లోడింగ్‌ ఖర్చు రైతులకు తడిసి మోపెడవుతుంది. కొన్ని గ్రామాల్లోని కేంద్రాల్లో హమాలీలకు ఒక్కో బస్తాకు (40కిలోలు) రూ.20 నుంచి రూ.25 రైతులు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాలలో క్వింటాల్‌కు రూ.60 ఇస్తున్నారు. గతంలో హమాలీ చార్జి ప్రభుత్వమే చెల్లించేది. దీంతో అన్నదాతపై కొంత భారం తగ్గేది. కానీ, 2017 రబీ సీజన్‌ నుంచి ప్రభుత్వం చేతులెత్తేసింది. మద్దతు ధర క్వింటాల్‌కు గ్రేడ్‌ ఏ రూ.2,320, కామన్‌ రకం రూ.2,060 ఉండగా, ఇందులో హమాలీలకు రూ.60 రైతులే చెల్లిస్తుండగా, మిల్లుల వద్ద దిగుమతి చేసేందుకు క్వింటాల్‌కు రూ.2 చొప్పున ఇస్తున్నారు. ధాన్యం తరలించేందుకు టన్నుకు రూ.200 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. కానీ ట్రాక్టర్‌ యజమానులకు గిట్టుబాటు కాకపోవడంతో రైతుల వద్ద అదనంగా మరో రూ.100 తీసుకుంటున్నారు.

ఊపందుకున్న కోతలు

కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ యాసంగిలో నాట్లు వేసిన వారం నుంచి మొగిపురుగు ఆశించి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంటను కాపాడుకునేందుకు రసాయన మందులు వాడారు. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టగా దిగుబడి అంతంతే వస్తుందని రైతులు వాపోతున్నారు. యాసంగిలో 2.60లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 80వేల ఎకరాల్లో కోతలు కోశారు. జిల్లావ్యాప్తంగా 249 కేంద్రాలను అధికారులు కేటాయించగా కొన్ని ప్రాంతాల్లో సెంటర్లు ప్రారంభమయ్యాయి. కాగా, ఇప్పటికే హమాలీలు సమావేశాలు నిర్వహించుకొని 20శాతం ధరలు పెంచేందుకు నిర్ణయించుకున్నారు.

చేతులెత్తేసిన ప్రభుత్వం

గతంలో క్వింటాల్‌కు రూ.5.30 చొప్పున ప్రభుత్వం హమాలీలకు చెల్లించేది. మిగిలిన డబ్బులు రైతులు కలుపుకొని ఇచ్చేవారు. దీంతో అన్నదాతలకు కొంత ఊరట లభించేది. 2017 నుంచి ప్రభుత్వం చేతులెత్తేయగా, అప్పటి నుంచి రైతులపై భారం పడుతుంది. హమాలీలు ధాన్యం ఎత్తడం, తూకం వేయడం చేయాలి. కానీ కొన్ని గ్రామాల్లో కేవలం తూకం మాత్రమే వేస్తున్నారు. దీంతో ధాన్యం ఎత్తడం రైతులకు ఇబ్బందిగా మారింది. ధాన్యం ఎత్తడం కోసం అదనంగా బస్తాకు రూ.8 కూలీలకు ఇవ్వాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. పెరిగిన పెట్టుబడులకు మద్దతు ధర సరిపోతలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా పౌరసరఫరాల శాఖ మంత్రి చొరవ తీసుకొని హమాలీ చార్జీలు పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో తడిసి మోపెడవుతున్న ఖర్చులు

క్వింటాల్‌కు రూ.55 చెల్లిస్తున్న రైతులు

2017కు ముందు క్వింటాల్‌కు రూ.5.30 ఇచ్చిన ప్రభుత్వం

తర్వాత చేతులెత్తేసిన సర్కార్‌

ప్రభుత్వమే చెల్లించాలంటున్న రైతులు

ప్రభుత్వమే చెల్లించాలి

రెండెకరాల్లో దొడ్డురకం వరి సాగు చేస్తే రెండురోజుల క్రితం కోత కోసిన. వాతావరణ మార్పులు, తెగుళ్లతో ఈసారి ఆశించిన దిగుబడి వచ్చేలా కనిపిస్తలేదు. ఎకరాకు రూ.25వేల పెట్టుబడి పెట్టిన. హమాలీలకు ప్రభుత్వం చెల్లిస్తే కొంత భారం తగ్గుతుంది. ప్రభుత్వం కలుగజేసుకొని భారం తగ్గించాలి.

– సంపత్‌, రైతు, వీణవంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement