
చదివింది పీజీ.. చేస్తోంది పారిశుధ్య పని
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆమె ఉన్నత విద్యావంతురాలు.. పీజీ, బీఈడీ పూర్తి చేసింది. తండ్రి పారిశుధ్య కార్మికుడు.. ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ పోషణకు కూతురు ఆ పనిలో చేరింది. ఉన్నత విద్యనభ్యసించిన ఆమె ప్రస్తుతం పారిశుధ్య పనులు చేస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి బల్దియా పరిధిలోని దేవునిపల్లికి చెందిన శ్యామల దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. కామారెడ్డిలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పీజీ, బీఈడీ కూడా చదివింది. శ్యామల తండ్రి నాగయ్య మూడు దశాబ్దాలపాటు పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాడు. ఆయన అనారోగ్యానికి గురవగా.. 2021లో ఆయన స్థానంలో శ్యామలను కాంట్రాక్టు కార్మికురాలిగా ఉద్యోగంలో చేర్చుకున్నారు. కొద్దిరోజులకే శ్యామల తండ్రి నాగయ్య చనిపోయాడు. కాగా పీజీతో పాటు బీఈడీ చదివిన శ్యామల పారిశుధ్య కార్మికురాలిగా పనిచేయడానికి అనేక ఇబ్బందులు పడుతోంది. మురికి కాలువలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, గడ్డి తీయడం వంటి పనులన్నీ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో మున్సిపల్ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి తన చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. మురికి కాలువలు శుభ్రం చేయడం మూలంగా ఆరోగ్యం కూడా దెబ్బతిందని శ్యామల ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన చదువును చూసి మున్సిపాలిటీలో ఏదైనా రాత పని ఇప్పించాలని వేడుకుంటోంది.
తండ్రి స్థానంలో పారిశుధ్య
కార్మికురాలిగా..
చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న శ్యామల