
నకిలీ ఇన్సూరెన్స్ కేసులో నిందితుల అరెస్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): అమాయకులను మోసం చేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ చేయిస్తున్న నిందితులను పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్ తెలిపారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన సుప్పాల రాజు కొన్నేళ్ల క్రితం తన ఆటోను తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన దూదేకుల మౌళానాకు అమ్మాడు. మౌళానా కొనుగోలు చేసిన ఆటో ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన ఇన్సూరెన్సు కోసం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. 2019–20లో హైదరాబాద్ కంపెనీ మేనేజర్ గురువర్దన్ బీమా పత్రాలు నకిలీవిగా గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నకిలీ ఇన్యూరెన్స్ చేయిస్తున్న తండ్రీకొడుకులు తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన ఏనుగు సాయిరెడ్డి, శ్రవణ్రెడ్డిపై 2019–20లో కేసు నమోదైనట్లు తెలిపారు. దీంతో వీరిని రిమాండు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులు సుమారు 500లకు పైగా నకిలీ బీమా పత్రాలు తయారు చేసి వాహనదారులకు అందజేసి రూ.లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. 2019–20 సంవత్సరానికి ముందు ఇన్సూరెన్సు పత్రాలు పొంది మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఎల్లారెడ్డి సీఐ 8712686159 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. లింగంపేట ఎస్సై వెంకట్రావు, సిబ్బంది ఉన్నారు.