
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
లింగంపేట/నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో నెలకొన్న అధ్యాపకుల కొరతను తీరుస్తూ గెస్ట్లెక్చరర్లను నియమించామని ఇంటర్ విద్య నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. నాగిరెడ్డిపేట, లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు.విద్యార్థులతోపాటు అధ్యాపకులతో వేర్వేరుగా మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాశాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని ప్రభత్వు జూనియర్ కళాశాలల్లో 5 వేల మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లాలో 20 జూనియర్ కళాశాలున్నాయని, వాటిల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఇప్పటివరకు 2,500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారన్నారు. అనంతరం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు రాజశేఖర్రెడ్డి ఉన్నారు.