
బడులకు భద్రత కరువు
నాగిరెడ్డిపేట: పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో సెలవులు పూర్తయ్యేవరకు పాఠశాలలవైపు కన్నెత్తి చూసేవారు ఉండరు. ఇదే అదనుగా భావించే ఆకతాయిలు పాఠశాలల భవనాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చుకునే అవకాశాలుంటాయి. దీంతోపాటు గతంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సెలవుల్లో చోరీలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి.
జిల్లాలో 710 ప్రాథమిక, 212 ప్రాథమికోన్నత, 322 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని చాలా పాఠశాలలకు డిజిటల్ బోర్డులు, కంప్యూటర్లు, డెస్క్బెంచీలతో పాటు తాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్వో ప్లాంట్లను సరఫరా చేశారు. పీఎంశ్రీ పథకం ద్వారా కొన్ని పాఠశాలలకు కంప్యూటర్లు, ట్యాబ్లను అందజేశారు. దీంతోపాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులున్నాయి. చాలా పాఠశాలల భవనాల చుట్టూ ప్రహరీలు లేవు. కొన్ని పాఠశాలల భవనాల చుట్టూ ప్రహరీలున్నా అవి పూర్తిస్థాయిలో లేవు. మరికొన్ని పాఠశాలల భవనాలకు సరైన గేట్లు కూడా లేవు. ప్రస్తుతం వేసవి సెలవులు ఇవ్వడంతో పాఠశాలలకు భద్రత కరువయ్యింది. వేసవి సెలవులు ముగిసేవరకు కాపలా కోసం తాత్కాలికంగా వాచ్మన్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రారంభమైన వేసవి సెలవులు
వాచ్మన్లు లేక ఇబ్బందులు