
రోడ్డు ప్రమాదం కాదు.. హత్యే..
జక్రాన్పల్లి: మండలంలోని సికింద్రాపూర్ 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ నెల 3న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మొదట యాక్సిడెంట్గా భావించగా, ఇటీవల హత్యగా పోలీసులు నిర్ధారించారు. జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో శనివారం డిచ్పల్లి సీఐ మల్లేష్, ఎస్సై తిరుపతి నిందితుల వివరాలను వెల్లడించారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లికి చెందిన బైరం రవీంద్రవర్మ (37) హైవేపై తలకు గాయాలై అనుమానస్పద స్థితిలో పడి ఉండగా జక్రాన్పల్లి పోలీసులు అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మొదటగా జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి గుర్తు తెలియని వాహనం ఢీకొని రవీంద్ర వర్మ మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ ఘటన స్థలంలో మృతుడి సెల్ఫోన్, బ్యాగ్ లభించకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిందితులు ఏ1 లక్ష్మీనర్సింలు, ఏ2 చింతల కృష్ణ, ఏ3 కడమంచి మారుతిని పట్టుకుని విచారించారు. వీరు ముగ్గురు కూడా బంధువులు. జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు నిందితులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం దారిదోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే రవీంద్ర వర్మను ముగ్గురు నిందితులు లిఫ్ట్ ఇస్తామని తమ వాహనంపై ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక సికింద్రాపూర్ గ్రామ శివారులో వాహనాన్ని ఆపి పథకం ప్రకారం రవీంద్ర వర్మను భయపెట్టి, అతని వద్ద గల సెల్ఫోన్, బ్యాగ్, డబ్బులు దోచుకున్నారు. రవీంద్ర వర్మ ఎదురు తిరగడంతో వారు బండరాయితో మోదడంతో స్మృహ కోల్పోయి కిందపడిపోయాడు. నిందితులు అతడిని 44వ నెంబర్ జాతీయ రహదారిపై పడేసి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు చిత్రీకరించారు. మృతుడి సెల్ఫోన్ను కనుక్కోవడంతో అసలు విషయం బయటపడింది. దీంతో రవీంద్ర వర్మను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్ఫోన్లతో పాటు స్కూటీ, బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి, సిబ్బందిని సీఐ అభినందించారు.
ఈనెల 3న జరిగిన సికింద్రాపూర్ యాక్సిడెంట్ కేసును చేధించిన పోలీసులు
ముగ్గురు నిందితుల అరెస్టు