
ట్రాన్స్కోలో ఇన్చార్జీల పాలన
నిజాంసాగర్: ట్రాన్స్కోలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఈలు, డీఈలు, ఏడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. దీంతో సకాలంలో సేవలందక వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు.
విద్యుత్ శాఖలో జిల్లావ్యాప్తంగా 10 ఏఈ పోస్టులు, నాలుగు ఏడీ పోస్టులు, ఒక డీఈ పోస్టు ఖాళీగా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్ ఏఈ పోస్టులు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డిటౌన్, బాన్సువాడ నియోజకవర్గంలో నస్రుల్లాబాద్, బీర్కూర్, కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ, సర్వపూర్, కామారెడ్డి టౌన్ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పిట్లం, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి టౌన్ ఏడీ పోస్టులు, బాన్సువాడ డివిజన్ డీఈ పోస్టు ఖాళీగా ఉంటున్నాయి. ఆయా స్థానాలలో ఇన్చార్జీలతో పాలన సాగుతోంది. దీంతో వినియోగదారులకు సకాలంలో సేవలందడం లేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమవుతుండడంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా గ్రామాల వారీగా కరెంట్ సమస్యలు కూడా ఎక్కువవుతాయి. అధికారుల పోస్టులను భర్తీ చేసి, కరెంట్ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
పలు ఏఈలు, ఏడీలు, డీఈ
పోస్టులు ఖాళీ..
ఇబ్బందిపడుతున్న వినియోగదారులు
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం
మండలాలవారీగా ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులతో పాటు ఏడీలు, డీఈ పోస్టులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాం. ప్రభుత్వం భర్తీ ప్రక్రియ చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. అప్పటి వరకు ఇన్చార్జిలతో సేవలు కొనసాగిస్తాం. సమస్యలను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రావణ్కుమార్, ఎస్ఈ, కామారెడ్డి