రెంజల్(బోధన్): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్షలో రెంజల్ విద్యార్థులు సత్తాచాటారు. జిల్లాలోనే అత్యధికంగా రెంజల్ మండలం నుంచి 17మంది ఎంపికయ్యారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తు వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్షలను ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా నుంయి 129 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే ఈ అర్హత పరీక్షల్లో ఎంపికై తే 4 సంవత్సరాల పాటు వారి ఖాతాల్లో నెలకు రూ. వెయ్యి చొప్పున, సంవత్సరానికి రూ. 12వేలను వారి ఖాతాల్లో జమ చేస్తారు.
ఎంపిక విధానం ఇలా:
పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. జిల్లా యూనిట్గా కేటగిరీలా వారీగా అర్హుల ఎంపిక నిర్వహిస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కేంద్రం నుంచి వచ్చిన జాబితా ఆధారంగా ఏఏ మండలం నుంచి ఎంత మంది ఎంపికయ్యారనేది గుర్తిస్తారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్ మండలం నుంచి అత్యధికంగా విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు అర్హత సాధిస్తారు. ఈసారి రెంజల్ మండలం నుంచి అత్యధికంగా విద్యార్థులు అర్హత సాధించారు.
ఎన్ఎంఎంఎస్కు అత్యధికంగా
17 మంది ఎంపిక
జిల్లావ్యాప్తంగా అర్హత సాధించిన
129 మంది
ప్రత్యేక తరగతుల ఫలితం
ప్రత్యేక తరగతుల ఫలితంగానే విద్యార్థులు అర్హత సాధించారు. పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంది.అలాగే సాధించాలనే పట్టుదల విద్యార్థుల్లో ఉండటం వల్లే మంచి ఫలితాలు వచ్చాయి. రెంజల్ హైస్కూల్ నుంచి 10 మంది, మోడల్ పాఠశాల నుంచి ఆరుగురు. మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి ఒకరు అర్హత సాధించారు. – ఆంజనేయులు,
రెంజల్ హైస్కూల్ హెచ్ఎం, ఎంఈవో
సద్వినియోగం చేసుకుంటా..
ఉపాధ్యాయులు ప్రతీరోజు నిర్వహించిన ప్రత్యేక తరగతులు ఎన్ఎంఎంస్ పరీక్షలో అర్హత సాధించడానికి ఎంతో దోహదపడ్డాయి. ఉపకార వేతనానికి ఎంపికై తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలని పట్టుదలతో చదివాను. ఎన్ఎంఎంఎస్కు ఎంపికవడంతో, స్కాలర్షిప్ను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులకు సిద్ధమవుతాను.
– గగన్కుమార్, రెంజల్ హైస్కూల్ విద్యార్థి
సత్తాచాటిన ‘రెంజల్’ విద్యార్థులు
సత్తాచాటిన ‘రెంజల్’ విద్యార్థులు