
సకాలంలో రుణాలు అందించాలి
కామారెడ్డి క్రైం: పంట రుణాలు, విద్య, బ్యాంకు లింకేజీ, మహిళ, శ్రీనిధి, స్వయం ఉపాధి రుణాలను సకాలంలో మంజూరు చేసి జిల్లా ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బ్యాంకులు, సంక్షేమ శాఖల వారీగా స్వయం ఉపాధి, ఎస్హెచ్జీ, వ్యవసాయ, తదితర రుణాల లక్ష్యాలు, ప్రగతిపై బుధవారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్డీఏ మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. అలాగే బకాయిలను త్వరగా వసూలు చేయాలన్నారు. జిల్లా పారిశ్రామిక కేంద్రం ద్వారా అందజేసే రుణాల వివరాలపై యువతకు అవగాహన కల్పిస్తూ వివిధ బ్యాంకులలో పెండింగ్లో ఉన్న రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలను త్వరగా మంజూరు చేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా రూ. 8,204.51 కోట్లతో వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. ప్రాధాన్యత రంగానికి రూ. 6,993.58 కో ట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 1,210.93 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 5,666.20 కోట్లతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఎంఎస్ఎంఈ లకు రూ. 1,102 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 155.52 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ. 21.81 కోట్లు, సంప్రదాయ ఇంధనానికి రూ. 4.05 కోట్లు, ఇతర రంగాలకు రూ.4 కోట్లు కేటాయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఎల్డీఎం చంద్రశేఖర్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, ఆర్బీఐ ఏజీఎం రెహమాన్, డీఆర్డీవో ఏపీడీ మురళీకృష్ణ, బ్యాంకర్లు పాల్గొన్నారు.
బ్యాంకర్లతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
రూ. 8,204.51 కోట్లతో వార్షిక
రుణ ప్రణాళిక ఖరారు