
‘భూ సమస్యల పరిష్కారానికి చర్యలు’
సదాశివనగర్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం యాచారం తండాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూభారతి చట్టాన్ని లింగంపేట్ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూ రికార్డులలో పేర్లు తప్పుగా ఉండడం, విస్తీర్ణం తక్కువగా నమోదు కావడం, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్పుస్తకం లేకపోవడం, సాదాబైనామా కేసుల పరిష్కారం, హద్దుల నిర్ధారణ తదితర భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. వాటిని కొత్త చట్టం ప్రకారం పరిశీలించి పరిష్కారం చూపుతామన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. వజ్జపల్లి తండాలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణను చూసి కార్యదర్శి పాపిరెడ్డిని అభినందించారు. హనుమాన్ ఆలయం ముందు వివిధ రకాల పండ్ల మొక్కలు, ఔషధాల మొక్కలు నాటాలని సూచించారు. తండాలో ఏర్పాటు చేసిన పశువుల షెడ్లు, ఫాంపాండ్ను పరిశీలించారు. ఆయా కార్యక్రమాలలో మండల ప్రత్యేకాధికారి సతీశ్ యాదవ్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ సత్యనారాయణ, డీటీ తిరుపతి, ఎంపీవో సురేందర్రెడ్డి, ఎంఈవో యోసెఫ్, ఏపీఎం రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్, నాయకులు లచ్చీరాం నాయక్, సర్దార్ నాయక్, బబ్యనాయక్, బలిరాం నాయక్, మంగ్య నాయక్, సక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వేగంగా సీఎంఆర్ అందించాలి
కామారెడ్డి క్రైం: రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్ డెలివరీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. వారంలోగా బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలన్నారు. కలెక్టరేట్లో గురువారం రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో కస్టం మిల్లింగ్ రైస్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లకు ఇచ్చిన 2023–24 యాసంగి ధాన్యాన్ని మరాడించి వచ్చేనెల 27 లోగా సమర్పించాలన్నారు. సకాలంలో సీఎంఆర్ పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వంద శాతం సీఎంఆర్ పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, పౌరసరఫరాల సంస్థ డీఎం రాజేందర్, సీఎస్వో మల్లికార్జున్బాబు, ఎల్డీఎం చంద్రశేఖర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

‘భూ సమస్యల పరిష్కారానికి చర్యలు’