
దంపతుల ఆత్మహత్య
ఖలీల్వాడి : నగరంలోని గాయత్రినగర్ ప్రాంతంలో దంపతుల ఆత్మహత్య శుక్రవారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కోటగల్లికి చెందిన శ్రీనివాస్ (56), మమత (52)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. శ్రీనివాస్ నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుండేవాడు. ఇటీవల కోటగల్లిలోని సొంతింటిని విక్రయించారు. కూతురికి పెళ్లి చేయడంతోపాటు ఇద్దరు కుమారులను గల్ఫ్ దేశానికి పంపించారు. ప్రస్తుతం గాయత్రినగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేర్వేరు గదుల్లో శ్రీనివాస్, మమత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని దంపతుల ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికుల ద్వారా తెలిసింది.