ఆశ.. నిరాశేనా? | - | Sakshi
Sakshi News home page

ఆశ.. నిరాశేనా?

Jun 5 2025 7:34 AM | Updated on Jun 5 2025 7:34 AM

ఆశ..

ఆశ.. నిరాశేనా?

నాలుగు ఎకరాల వరకే

అందిన పెట్టుబడి సాయం

జిల్లాలో మరో 56 వేల మందికి

అందని యాసంగి రైతు భరోసా

నిరాశలో లబ్ధికి దూరమైన రైతులు

రైతులకు పంటల పెట్టుబడి విషయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2018 లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఏటా రెండు వ్యవసాయ సీజన్లలో పెట్టుబడి సాయం అందించారు. మొదట్లో సీజన్‌కు ఎకరానికి రూ. 4 వేల చొప్పున రైతుబంధు ఇచ్చారు. ఆ తర్వాత దానిని రూ. 5 వేలకు పెంచారు. తాము అధికారంలోకి వస్తే ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక రైతుబంధులో అనేక లోపాలు ఉన్నాయని, సాగుకు యోగ్యం కాని భూములకూ రైతుబంధు ఇచ్చారని చెబుతూ అనర్హులను ఏరివేసేందుకు ఓ కమిటీ వేసింది. అధికార యంత్రాంగం ద్వారా సాగుకు యోగ్యం కాని భూముల లెక్కలు తీశారు. రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చారు. అంతా పూర్తయ్యాక ప్రభుత్వం నిధుల కొరత కారణంగా ఎకరానికి సీజన్‌కు రూ.6 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. మార్చి 31 వరకల్లా వంద శాతం రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు నాలుగెకరాలలోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందింది. మార్చి నెలాఖరు తర్వాత ఒక్క రైతుకూ పెట్టుబడి సాయం అందించలేదు.

ఇస్తారో.. లేదో?

తమ మొదటి ప్రాధాన్యత రైతు సంక్షేమమేనని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా పథకాల అమలులో మాత్రం రైతులకు నిరాశనే మిగులుస్తోంది. పంట రుణాల మాఫీతోపాటు రైతుభరోసా నిధుల విడుదల విషయంలోనూ జిల్లాలో వేలాది మంది రైతులకు మొండిచేయి చూపింది. ఖరీఫ్‌ సాగు పనులు ప్రారంభమవుతున్నా.. ఇప్పటికీ జిల్లాలో సుమారు 56 వేల మందికి యాసంగి పెట్టుబడి సాయం అందలేదు. వారంతా సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. – కామారెడ్డి క్రైం

రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ జనవరి 26 న ప్రారంభమైంది. అప్పటి లెక్కల ప్రకారం జిల్లాకు సంబంధించి మొత్తం 3,25,713 మంది రైతులకుగాను రూ.315.31 కోట్ల నిధులు అవసరం. మార్చి నెలాఖరు వరకు 2,70,149 మంది రైతుల ఖాతాలలో రూ. 215.98 కోట్లు జమ చేశారు. మిగిలిన సుమారు 56 వేల మందికి సంబంధించి రూ. 100 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. యాసంగి సీజన్‌ ముగిసిపోయి ఖరీఫ్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ మిగిలిన రైతులకు రైతు భరోసా అందిస్తారా లేదా అన్న విషయమై స్పష్టత లేదు. దీంతో వారంతా నిరాశకు గురవుతున్నారు. సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. గురువారం నిర్వహించే క్యాబినెట్‌ మీటింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికీ పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆశ.. నిరాశేనా?1
1/1

ఆశ.. నిరాశేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement