సినీ ఫక్కీలో లారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో లారీ చోరీ

Mar 15 2023 12:34 AM | Updated on Mar 15 2023 12:34 AM

లారీ చోరీలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు - Sakshi

లారీ చోరీలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

కామారెడ్డి క్రైం : సినీ ఫక్కీలో లారీని చోరీ చేసిన నిందితులను కామారెడ్డి జిల్లా సదాశినగర్‌ పోలీసులు 24 గంటల్లో గుర్తించారు. వారిలో ఒకరిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. మంగళవారం ఎస్పీ శ్రీనివాసరెడ్డి తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మెదక్‌కు చెందిన రమేశ్‌ గౌడ్‌ తన లారీలో చెరుకు నింపుకొని ఈనెల 12న గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీకి వచ్చాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అన్‌లోడ్‌ చేసి గ్రామానికి తిరిగి వెళ్తుండగా అడ్లూరు ఎల్లారెడ్డి సమీపంలో స్కార్పియో వాహనంలో ఐదుగురు వచ్చి లారీని ఆపారు. రమేశ్‌ గౌడ్‌ను లారీలోంచి కిందకి దించారు. కళ్లల్లో కారం చల్లి చితకబాదారు. తర్వాత అతడిని రోడ్డు పక్కన పడేసి లారీతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సదాశినగర్‌ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలించి విచారణ ప్రారంభించారు. సోమవారం రాత్రి లారీని మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో గుర్తించారు. లారీ దోపిడీ ఘటనలో నిందితుల్లో ఒకడైన మహారాష్ట్రలోని ముథ్కేడ్‌కు చెందిన తలికాటి విట్టల్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. వారిని కూడా తొందరలోనే అరెస్టు చేస్తామన్నారు. లారీతో పాటు స్కార్పియో వాహనం, ఓ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి గురైన లారీని 24 గంటల వ్యవధిలోనే గుర్తించి కేసు పరిశోధనలో విశేషంగా కృషి చేసిన సదాశివనగర్‌ సీఐ రామన్‌, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అరెస్టయిన నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.

24 గంటల్లో పట్టుకున్న పోలీసులు

ఒకరి అరెస్ట్‌, పరారీలో మరో నలుగురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement