
బంధాన్ని కాదని.. అనుబంధాన్ని తెంచుకుని..
● రైలు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు
● తండ్రిని వద్దంటున్న కుమారుడు..
తనకు భర్త లేడంటున్న భార్య
తణుకు అర్బన్: వివాహ బంధాన్ని భార్య వద్దంటోంది. కన్నతండ్రితో అనుబంధాన్ని కుమారుడు తెంచుకుంటున్నాడు. ఏడేళ్ల క్రితం తెగిపోయిన రక్తసంబంధం నేడు ఎదురైనా తమకు వద్దంటే వద్దని ఆ కుటుంబం తెగేసి చెబుతోంది. దీంతో ప్రమాదవశాత్తూ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు అల్లాడుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన కలగర సుబ్బారావు ఏడేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం కాల్దారి స్టేషన్లో రైలు నుంచి జారిపడగా రైల్వే పోలీసులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడిని ఆరా తీయగా కుటుంబ సభ్యుల వివరాలు తెలిపారు. రైల్వే కానిస్టేబుల్ బాల విషయాన్ని వృద్ధుడి కుమారుడు సుధీన్రాజుకు ఫోన్ ద్వారా తెలియజేయగా తనకు నాన్న అవసరం లేదని తెగేసి చెప్పాడు. అయినా కానిస్టేబుల్ బాల ప్రకాశరావుపాలెంలోని ఇంటికి వెళ్లి వృద్ధుడి భార్యతో విషయం చెప్పగా తన భర్త ఎప్పుడో చనిపోయాడని, అతడి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వితంతు పింఛను కూడా పొందుతున్నట్టు సమాధానం ఇవ్వడంతో రైల్వే పోలీసులు ఆశ్చర్యపోయారు.
కేసు నమోదు చేసినా ఇబ్బంది లేదు
సుధీన్రాజును ఎట్టకేలకు రైల్వే పోలీసులు తణుకు ఆస్పత్రికి తీసుకురాగా సోమవారం ఆర్ఎంఓ డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు కౌన్సెలింగ్ ఇచ్చారు. తమకు సుబ్బారావు అవసరం లేదని, అవసరమైతే అలా రాసిస్తామని సుధీన్రాజు సమాధానమిచ్చాడు. దీంతో సీఐ ఎన్.కొండయ్య ఆస్పత్రి వద్దకు వచ్చి కన్న తండ్రిపై నిర్లక్ష్యం వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించగా.. కేసు నమోదు చేసుకోమని సుధీన్రాజు తెగేసి చెప్పాడు. దీంతో చేసేదిలేక ఆస్పత్రి వైద్యులు సుబ్బారావుకు చికిత్స అందిస్తున్నారు.

బంధాన్ని కాదని.. అనుబంధాన్ని తెంచుకుని..