
ఎండ వేడికి పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్
నిడదవోలు : పట్టణంలోని బసివిరెడ్డిపేట విద్యుత్ సబ్ స్టేషన్లో ఎండ వేడికి సోమవారం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రానన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ బయటకు రావడంతో అంటుకొని మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న గడ్డి మొక్కలు మంటలకు కాలిపోయాయి. పురుషోత్తపల్లి విద్యుత్ ఏఈ బి.రమేష్బాబు ఘటనా స్థలానికి చేరుకొని తన సిబ్బందితో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ తీసివేసి ప్రత్యామ్నాయంగా మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ఓ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30,000 ఆస్తి నష్టం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో నిడదవోల పట్టణంలోని బసివిరెడ్డిపేట, నిడదవోలు మండలంలోని సమిస్రగూడెం, అట్లపాడు, తాళ్లపాలెం, శెట్టి పేట గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.