
వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా
పిఠాపురం: మహిళల విషయంలో జరిగే ప్రచారాల్లో గోప్యత పాటించాలన్న నిబంధనను విస్మరించి పదేపదే ప్రచారం చేస్తున్నది కూటమి నేతలేనని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమరావతి విషయంలో టీవీ డిబేట్లో జరిగిన విషయం తక్కువ మందికే తెలుసన్నారు. కానీ, దానిపై రాద్ధాంతం చేసి అన్ని చానళ్లలో పదేపదే ప్రచారం చేస్తూ, బహిరంగంగా మాట్లాడుతూ మహిళలను కించపరుస్తున్నది కూటమి నేతలేనని ఆమె మండిపడ్డారు.
ఒకసారి అన్న మాటలను పదేపదే అంటున్న కూటమి నేతల పైనే కేసులు పెట్టాలని అన్నారు. మహిళలపై అభ్యంతరకర మాటలు మాట్లాడిన వారి కంటే, వాటిని బహిరంగంగా ప్రచారం చేస్తున్న వారే నేరస్తులవుతారని చట్టాలు చెబుతున్నాయన్నారు. టీవీ లైవ్ డిబేట్లలో అనుకోకుండా తప్పులు దొర్లుతూంటాయని, వాటిని సరిదిద్దుకోవాల్సిన వారు సరి చేసుకున్నా పట్టించుకోకుండా, అన్నవారిపై కాకుండా ఎటువంటి తప్పూ చేయని కేఎస్ఆర్పై అక్రమ కేసు పెట్టి వేధించడం సరికాదని గీత అన్నారు.
ఇదే విషయంపై పలు పత్రికల్లో కథనాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోందని, వాటిపై కూడా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి నేతలు దాడులకు దిగుతున్నారన్నారు. సాక్షి టీవీ చానల్కు, పత్రికకు సంబంధం లేని అంశాన్ని వాటిపై రుద్ది కావాలనే సాక్షి కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉండే పత్రికా స్వేచ్ఛపై దాడికి దిగడం అమానుషమని పేర్కొన్నారు.
ఇటీవల వైఎస్సార్ సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైందని, ప్రజల నుంచి ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఏమీ చేయలేని కూటమి నేతలు పత్రికా కార్యాలయాలపై ఇలా దాడులకు ఎగబడుతున్నారని దుయ్యబట్టారు. కేవలం ఏడాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూటమిదేనని, అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సాక్షి పత్రిక, చానల్పై లేనిపోని రాద్ధాంతం చేసి, అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ఇటువంటి తప్పుడు చర్యలకు స్వస్తి చెప్పి, ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని, లేకపోతే ప్రజలందరూ కూటమి నేతలను రోడ్డుకీడ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గీత అన్నారు.