
జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
ఫ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి
ఫ ఎస్పీకి పాత్రికేయుల వినతి
ఫ సానుకూలంగా స్పందించిన బిందుమాధవ్
ఫ జిల్లావ్యాప్తంగా మీడియా ప్రతినిధుల వినతులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న కూటమి నేతల తీరుపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా ప్రతినిధులు, పాత్రికేయులపై కూటమి సర్కారు దాడులు, కక్ష సాధింపు చర్యలపై జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో ప్రజా, జర్నలిస్టు సంఘాలు మంగళవారం నిరసన తెలిపాయి. జిల్లా కేంద్రం కాకినాడలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు జిల్లా ఎస్పీ గరికపాటి బిందుమాధవ్కు విజ్ఞాపన అందజేశారు. సాక్షి మీడియాతో పాటు జర్నలిస్టులందరికీ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాల్లోని జర్నలిస్టులు ఎస్పీని కలిశారు. తమ హక్కులు, విధులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా, దాడులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అది తమ బాధ్యతని భరోసా ఇచ్చారు.
దాడులను ప్రజాస్వామిక వాదులు ఖండించాలి
ఈ సందర్భంగా కాకినాడ సిటీ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు, జర్నలిస్టులపై దాడులకు తెగబడటం, కార్యాలయాలను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని కోరారు. జిల్లా జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ, ఇటువంటి దాడులకు తెగబడటం సహేతుకం కాదని అన్నారు. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులపై పోలీసులు తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీని కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టు డాక్టర్ సబ్బెళ్ల శివనారాయణరెడ్డి, సాక్షి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బ్యూరో చీఫ్ లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి టీవీ కరస్పాంటెడ్ బొక్కినాల రాజు, మేకల వెంకట రమణ, పాత్రికేయులు కొమ్మిరెడ్డి శ్రీధర్, తోట చక్రధర్, విశ్వనాథుల రాజబాబు, బొత్స వెంకట్, తలాటం సత్యనారాయణ, మురళి, దొమ్మేటి నాగరాజు తదితరులున్నారు.
సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులను తక్షణం కట్టడి చేయాలంటూ కాకినాడతో పాటు కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులు పోలీసు స్టేషన్లలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు విజ్ఞాపనలు అందజేశారు. పిఠాపురంలో జర్నలిస్టులు విజ్ఞాపన పత్రం అందజేసేందుకు వెళ్లగా సీఐ స్థానికంగా లేరు. ఆయన ఆదేశాలతో పిఠాపురం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ మణికుమార్కు సాక్షి ఆర్సీ ఇన్చార్జి వీవీవీ ప్రసాద్తో పాటు మిగిలిన జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన విలేకరులందరి ఆధార్ కార్డులు, ఇంటి అడ్రస్సులు ఇవ్వాలని ఎస్సై మణికుమార్ అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కాకినాడ కార్యాలయం వద్ద బందోబస్తు
సాక్షి కార్యాలయాలపై దాడులపై ఎస్పీ బిందుమాధవ్కు వినతిపత్రం ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ దేవాలయం వీధిలోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం వద్ద రాత్రి కాకినాడ వన్టౌన్ పోలీసులు బందోబస్తు చేపట్టారు.