
మహిళల రక్షణలో ఘోర వైఫల్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో సీ్త్రలు, బాలికలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మహిళలు మండిపడ్డారు. మహిళలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యాచారాలు, హత్యలు లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో మహిళలు కాకినాడలో మంగళవారం కదం తొక్కారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కాకినాడ ఇంద్రపాలెం వద్ద ఉన్న అంబేడ్కర్ సెంటర్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నేలపై కూర్చుని నిరసన తెలిపారు. వారినుద్దేశించి మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మహిళలపై ప్రతి రోజూ పదుల సంఖ్యలో దాడులు, హత్యాచారాలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కరువైందని, చిన్నారులపై హత్యాచారాలు మితిమీరిపోయినా ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందని, మహిళలపై దాడులు అరికట్టాలని, రక్షణ కల్పించాలని, ప్రభుత్వం తక్షణం స్పందించాలని, జై జగన్ అని పెద్ద పెట్టున నినదించారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశికుమారి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫ కాకినాడలో మహిళల ఆందోళన
ఫ భారీ ర్యాలీ, ధర్నా
ఫ అంబేడ్కర్ విగ్రహానికి విజ్ఞాపన

మహిళల రక్షణలో ఘోర వైఫల్యం