
ఫ్రీ బస్సు.. హోల్డాన్
● ఏపీకి వచ్చేది ఎప్పుడో!
● అంతా ఉత్తుత్తి హామీనే..
● మహిళలను వంచించిన బాబు
● ఉచిత ప్రయాణం హామీ గాలికి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఏరుదాటే వరకు ఓడ మల్లన్న ఏరుదాటక బోడి మల్లన్న’ అన్న సామెత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరిపోలుతుంది. ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండదనే విషయం ప్రతి సందర్భంలోనూ స్పష్టమవుతూనే ఉంటుంది. అధికారం కోసం సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు.. వాటిని అమలు చేయాల్సి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేసిన దాఖలాల్లేవు. నాటి ఎన్నికల్లో ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఊరూవాడా ఊదరగొట్టారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటే ఆశ ఉన్నా.. గత అనుభవాల రీత్యా చంద్రబాబు దీనిని అమలు చేస్తారా అనే సంశయం వెంటాడుతూనే ఉంది. ఊహించినట్టుగానే గద్దెనెక్కి ఏడాది కావస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఇంతవరకూ చంద్రబాబు ఎటువంటి స్పష్టతా లేకుండా చేశారని మహిళలు మండిపడుతున్నారు.
అక్కడ రైట్రైట్..
పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. కానీ, మన రాష్ట్రంలో దీనిని అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని మొత్తానికే తూచ్ అనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సంపద సృష్టిస్తామన్న బాబు ఇప్పుడు ఉచిత బస్సు హామీపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయమేస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఆయన.. ఇప్పుడు ఈ హామీలన్నింటినీ అసలు అమలు చేస్తారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటి నుంచీ కాకినాడ.. ఇంటర్, డిగ్రీ కాలేజీలతో పాటు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, రంగరాయ వైద్య కళాశాల, ప్రైవేటు నర్సింగ్ కాలేజీలతో పాటు అన్ని రకాల బ్రాండెడ్ వస్తువుల మార్కెట్కు కేంద్రం. విద్య, వైద్యంతో పాటు ఇతర అవసరాల కోసం మహిళలు, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు గ్రామీణ ప్రాంతాల నుంచి కాకినాడకు రాకపోకలు సాగిస్తూంటారు. జిల్లాల పునర్విభజన తరువాత కూడా కాకినాడకు మహిళల రాకపోకల విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది మహిళలున్నారు. ఏలేశ్వరం, తుని, కాకినాడల్లో ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ మూడు డిపోల పరిధిలో 321 బస్సులను జిల్లా ప్రజా రవాణా శాఖ నిర్వహిస్తోంది. ఇందులో 250 సొంత, 71 అద్దె బస్సులున్నాయి. ఆయా డిపోల నుంచి ఈ బస్సులు ప్రతి రోజూ లక్షా 14 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 78 ఉంటోంది. మొత్తం బస్సుల్లో 156 పల్లె వెలుగు బస్సులున్నాయి. మొత్తం ప్రయాణికుల్లో సగం మంది ఈ పల్లె వెలుగు బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. మొత్తం బస్సులలో రోజుకు సగటున 66,379 మంది ప్రయాణిస్తూండగా.. వీరిలో సగం మంది మహిళలే ఉంటారని లెక్కలు వేస్తున్నారు. గత మే నెలలో ఆర్టీసికి రూ.20.58 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో సగం మంది మహిళా ప్రయాణికుల ద్వారా రూ.10.25 లక్షలు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 12 నెలలకు రూ.1.23 కోట్ల ఆదాయం మహిళా ప్రయాణికుల ద్వారానే వస్తోంది. చంద్రబాబు గద్దెనెక్కి ఏడాది కావస్తోంది. ఉచిత బస్సు ప్రయాణ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అమలు చేయకపోవడంతో ఏడాది కాలంగా జిల్లాలోని మహిళలు రూ.1.23 కోట్ల మేర నష్టపోయారు. ఈ హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులు ఉచిత ప్రయాణంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఆగస్ట్ 15 నుంచి అమలు చేస్తామని ఓ ఫీలర్ వదిలారు. అయితే, దీని విధివిధానాలేమిటనే దానిపై ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా లేదు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం హామీని అసలు అమలు చేస్తారా లేక మిగిలిన హామీల మాదిరిగానే చాప చుట్టేస్తారా అని మహిళలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గం మహిళలు
తుని 1,11,800
ప్రత్తిపాడు 1,08,207
పిఠాపురం 1,14,819
కాకినాడ రూరల్ 1,31,591
పెద్దాపురం 1,07,478
కాకినాడ సిటీ 1,23,166
జగ్గంపేట 1,13,720
ఇంత మోసమా బాబూ!
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పథకాలను కాపీ కొట్టి, ఇక్కడి మహిళలను నమ్మించి ఓట్లేయించుకున్నారు. ఆ రాష్ట్రాల్లో అమలైనట్టే ఇక్కడ కూడా అమలు చేస్తారనే నమ్మకంతోనే మహిళలు ఓట్లేసి కూటమిని గెలిపించారు. అక్కడి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేశాయి. ఇక్కడ గారడీ బాబు ఏడాదైనా అమలు చేయలేదు. ఆగస్టు 15న అమలు చేస్తానంటున్న ఆయన మాటలను మహిళలు నమ్మలేకపోతున్నారు. చంద్రబాబుకు ఏదీ ఉచితంగా ఇచ్చే మనస్తత్వం లేదు. పేదలంటే ఆయనకు అస్సలు పడదు. మహిళలను నమ్మించి ఓట్లేయించుకుని ఇంత మోసం చేస్తారా? మీకు న్యాయమనిపిస్తోందా? ఎన్నికల్లో ఊరూవాడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదైపోయింది. ఇన్ని నెలల పాటు మీరిచ్చిన హామీ అమలు చేసి ఉంటే మహిళలకు ఆ మేరకు బస్సు చార్జీలు తగ్గి న్యాయం జరిగేది కదా!
– వంగా గీత, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పిఠాపురం

ఫ్రీ బస్సు.. హోల్డాన్